షార్జా: నరాలు తెగే ఉత్కంఠతో జరిగిన మ్యాచ్లో చివరకు విజయం వెస్టిండీస్నే వరించింది. టీ20 ప్రపంచకప్ గ్రూప్-1లో భాగంగా బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ ముగిసింది. చివరి బంతి వరకూ విజయం ఎవరిదో తేల్చలేని స్థితిలో జరిగిన ఈ మ్యాచ్లో చివరి బంతికి వెస్టిండీస్ విజయం సాధించింది.
ఒక బంతికి నాలుగు పరుగులు కావలసిన సమయంలో బంగ్లా కెప్టెన్ మహ్మదుల్లా (31) బంతిని కనెక్ట్ చేయలేకపోయాడు. దీంతో మూడు పరుగుల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. ఇప్పటికే రెండు ఓటములు మూటగట్టుకున్న విండీస్ సెమీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో సత్తా చాటింది. 143 పరుగుల లక్ష్యఛేదనలో బంగ్లా బ్యాట్స్మెన్ నెమ్మదైన ఆటతీరే వారి కొంపముంచింది.
ఓపెనర్లుగా వచ్చిన మొహమ్మద్ నయీమ్ (17), షకీబల్ హసన్ (9) జట్టుకు గట్టి ఆరంభం ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత లిటాన్ దాస్ (44) నిలబడినా అతను కూడా భారీ షాట్లు ఆడలేకపోయాడు. సౌమ్య సర్కార్ (17) ఊహించని విధంగా అవుటవగా, అనవసర షాట్కు యత్నించి ఫామ్లో ఉన్న ముష్ఫికర్ రహీమ్ (8) వికెట్ పారేసుకున్నాడు.
కెప్టెన్ మహ్మదుల్లా చివరి వరకూ క్రీజులోనే ఉన్నా ఫలితం లేకపోయింది. వెస్టిండీస్ బౌలర్లలో రవి రాంపాల్, ఆండ్రీ రస్సెల్, జేసన్ హోల్డర్, అకియల్ హొస్సేన్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.