కండ్లు చెదిరే మెరుపు ఇన్నింగ్స్లు.. అబ్బురపరిచే బౌలింగ్ ప్రదర్శనలు.. వారెవ్వా అనిపించే ఫీల్డింగ్ విన్యాసాలతో రెండు నెలలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఐపీఎల్-15వ సీజన్కు నేటితో తెరపడనుంది. అరంగేట్ర సీజన్లోనే అదుర్స్ అనిపిస్తూ ఫైనల్ చేరిన గుజరాత్ టైటాన్స్తో లీగ్ ఆరంభ సీజన్లో తప్ప ఇప్పటి వరకు తుదిపోరుకు చేరని రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. గత రెండేండ్లతో పోల్చుకుంటే ఐపీఎల్కు క్రేజ్ తగ్గిన మాట వాస్తవమే అయినా..మండు వేసవిలో పసందైన పరుగుల విందు అందించిన లీగ్కు అదే స్థాయి ముగింపు దక్కడం ఖాయంగా కనిపిస్తున్నది! మరింకెందుకు ఆలస్యం.. టీవీలు ట్యూన్ చేసేయండి!!
అహ్మదాబాద్: రెండు నెలల నుంచి అభిమానులను ఉర్రూతలూగించిన ఐపీఎల్-15వ సీజన్ తుది అంకానికి చేరుకుంది. ఆదివారం జరుగనున్న ఫైనల్లో గుజరాత్ టైటాన్స్తో రాజస్థాన్ రాయల్స్ అమీతుమీ తేల్చుకోనుంది. లీగ్ దశలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన ఈ రెండు జట్ల మధ్య జరిగిన తొలి క్వాలిఫయర్లో విజయం సాధించిన గుజరాత్ నేరుగా తుది పోరుకు అర్హత సాధించగా.. క్వాలిఫయర్-2లో బెంగళూరుపై గెలుపుతో రాజస్థాన్ ముందంజ వేసింది. బలాబలాల పరంగా ఇరు జట్లు సమంగానే ఉన్నా.. ఆల్రౌండర్లు దట్టంగా ఉన్న గుజరాత్ వైపు కాస్త మొగ్గు కనిపిస్తున్నది. ఆస్ట్రేలియా స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ సారథ్యంలో ఐపీఎల్ తొలి సీజన్ (2008)లో టైటిల్ నెగ్గిన రాజస్థాన్.. ఆ తర్వాత ఒక్కసారి కూడా తుదిపోరుకు అర్హత సాధించలేకపోయింది. స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ కెరీర్లోనే ఉత్తమ ఫామ్లో ఉండటం రాజస్థాన్కు కొండంత బలం కాగా.. శాంసన్, హెట్మైర్, జైస్వాల్ రూపంలో టాపార్డర్లో హిట్టర్లు అందుబాటులో ఉన్నారు. మరి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో అశేష ప్రేక్షక వాహిని మధ్య సొంత జట్టు కప్పు ఎగురేసుకెళ్తుందా.. లేక రాజస్థాన్ డబుల్ ధమాకా మోగిస్తుందా చూడాలి!
గుజరాత్ ఘనంగా..
ఐపీఎల్లో తొలిసారి అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్.. అరంగ్రేట సీజన్లోనే అదిరిపోయే ప్రదర్శన కనబర్చింది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్ల్లో పదింట నెగ్గి పాయింట్ల పట్టిక టాప్లో నిలిచిన గుజరాత్.. తొలి క్వాలిఫయర్లో రాజస్థాన్పై అలవోక విజయంతో ఫైనల్కు చేరింది. సీజన్ ఆసాంతం నిలకడగా రాణిస్తున్న టైటాన్స్.. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఇలా మూడు రంగాల్లో వంక పెట్టని రీతిలో ఆకట్టుకుంటున్నది. శుభ్మన్ గిల్, వృద్ధిమాన్ సాహా రూపంలో మంచి ఓపెనింగ్ జోడీ అందుబాటులో ఉండగా.. వన్డౌన్లో మాథ్యూ వేడ్, ఆ తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా క్రీజులోకి వస్తున్నారు. ఈ నలుగురిలో ఏ ఇద్దరు క్లిక్ అయినా.. గుజరాత్ భారీ స్కోరుకు బాటలు పడటం ఖాయమే. ఇక మిడిలార్డర్లో డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా రూపంలో ఇద్దరు భీకర హిట్టర్లు ఉండటం టైటాన్స్కు కలిసి రానుంది.
జోష్లో రాయల్స్..
ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ అద్వితీయ ఆటతీరుతో ఐపీఎల్-15 ఫైనల్కు దూసుకొచ్చింది. బ్యాటింగ్లో జోస్ బట్లర్ జట్టును ముందుండి నడిపిస్తుండగా.. బౌలింగ్లో యుజ్వేంద్ర చాహాల్ దుమ్మురేపుతున్నాడు. బట్లర్ ఆడిన 16 మ్యాచ్ల్లో 58.86 సగటుతో 824 పరుగులు సాధించాడు. ఇక బౌలింగ్లో చాహల్ 19.50 సగటుతో 26 వికెట్లు పడగొట్టి వికెట్ల వీరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
తుది జట్లు (అంచనా)
గుజరాత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, సాహా, వేడ్, మిల్లర్, తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, షమీ.
రాజస్థాన్: శాంసన్ (కెప్టెన్), బట్లర్, జైస్వాల్, పడిక్కల్, హెట్మైర్, పరాగ్, అశ్విన్, బౌల్ట్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ, మెక్కాయ్.