సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: పికిల్ బాల్ పాశ్చాత్య దేశాలకు బాగా పరిచయమున్న క్రీడ. టెన్నిస్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్ సమాహారంగా ఇది రూపుదిద్దుకున్నది. బ్యాడ్మింటన్ కోర్టులో టెన్నిస్ నెట్తో టేబుల్ టెన్నిస్ రాకెట్ కంటే పెద్దగా ఉండే బ్యాట్తో సింథటిక్ రబ్బర్ బాల్తో ఆడేదే పికిల్ బాల్. అమెరికా, యూరప్ దేశాల్లో దినదినాభివృద్ధి చెందుతూ భారత్లో కొత్త పుంతలు తొక్కుతున్న పికిల్బాల్ పోటీలకు వేళయైంది. తెలంగాణలో తొలిసారి జరుగబోతున్న జాతీయ టోర్నీకి ఈ నెల 24న తెరలేవబోతున్నది.ఎల్బీ ఇండోర్ స్టేడియంలో ఏడవ జాతీయ చాంపియన్షిప్ మొదలవుతున్నది.
ఇందుకు సంబంధించి మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెచ్యూర్ తెలంగాణ పికిల్బాల్ అసోసియేషన్(ఏటీపీఏ)అధ్యక్షుడు రావుల శ్రీధర్రెడ్డి టోర్నీ విశేషాలను వివరించారు. ‘రాష్ట్ర ప్రజలకు పికిల్బాల్ను పరిచయం చేయబోతున్నందుకు సంతోషంగా ఉంది. క్రీడలనేవి మన జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి.
కరోనా వైరస్ విజృంభణ తర్వాత ప్రతి ఒక్కరి జీవనశైలిలో మార్పులు వచ్చాయి. పికిల్బాల్ అనేది ఆట మాత్రమే కాదు.. ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంతో పాటు ఒత్తిడి దరిచేరకుండా చూసుకోవచ్చు’ అని అన్నారు. టోర్నీలో 18 రాష్ర్టాల నుంచి దాదాపు 250 మంది ప్లేయర్లు పాల్గొంటున్నారని శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జరిగే టోర్నీ ప్రారంభ కార్యక్రమానికి రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి శ్రీనివాస్యాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వివరించారు.