WFI : ఏకపక్ష నిర్ణయంతో నిషేధానికి గురైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) అధ్యక్షుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) పోలీసులను ఆశ్రయించాడు. తనతో పాటు బ్రిజ్ భూషణ్(Brij Bhushan)ను చంపేస్తామని కొందరు బెదిరిస్తున్నారని జనవరి 13న ఫిర్యాదు చేశాడు. జనవరి 12వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి నన్ను, బీజీపీ ఎంపీ బ్రిజ్భూషణ్ను ఖతం చేస్తామని బెదిరించాడు అని సంజయ్ తెలిపాడు. దాంతో, ఉత్తరప్రదేశ్ పోలీసులు ఐపీసీ 504, 507 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలు పెట్టారు.
బ్రిజ్ భూషణ్ సన్నిహితుడైన సంజయ్ సింగ్ ఎన్నికైన రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎంపికయ్యాడు. అయితే.. ఎన్నికల్లో గెలిచిన అనంతరం క్రీడా శాఖను సంప్రదించకుండానే సంజయ్ జాతీయ స్థాయి అండర్ -15, అండర్-20 రెజ్లింగ్ పోటీలు ఉత్తరప్రదేశ్లో జరుగుతాయని ప్రకటించాడు. దాంతో జాతీయ క్రీడా నిబంధనలను ఉల్లంఘించారని అతడి బృందాన్ని భారత క్రీడా మంత్రిత్వ(Sports Ministry) శాఖ రద్దు చేసింది. తదుపరి ప్రకటన వెల్లడించేంత వరకూ సస్పెన్షన్ కొనసాగతుందని తెలిపింది. అయితే.. రెజ్లింగ్ సమాఖ్య రద్దుపై కోర్టులో తేల్చుకుంటానని సంజయ్ ప్రకటించాడు.
భజ్రంగ్, వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్
రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ ఎన్నికను నిరసిస్తూ స్టార్ రెజ్లర్ సాక్షి మాలిక్(Sakshi Malik) తాను ఇక కుస్తీని వదిలేస్తున్నానని కన్నీటి పర్యంతమైంది. ఒలింపిక్ విజేత భజ్రంగ్ పూనియా(Bajran Punia), వినేశ్ ఫోగట్లు తమ అవార్డును తిరిగిచ్చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు సంజయ్, బ్రిజ్ భూషణ్ గుండాలు తమను బెదిరిస్తున్నారని వినేశ్ ఫోగట్ సోషల్మీడియా పోస్ట్లో వెల్లడించింది. ఇప్పుడు సంజయ్ కూడా తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని పోలీసులను ఆశ్రయించడం గమనార్హం.