కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో బల్దియా కార్యాలయాల్లో నిబంధనలను కఠినంగా అమలు చే స్తున్నారు. ఇప్పటి వరకు మాస్కు ఉన్న వారినే లోపలికి అనుమతించగా.. తాజాగా వ్యాక్సిన్ వేయించుకున్న వారిని మాత్రమే ప్రవేశం కల్పిస్తున్నారు. జీహెచ్ఎంసీలోని పారిశుధ్య కార్మికుల నుంచి సీనియర్ అధికారుల వరకు అందరికీ ఈనెల 15లోగా కరోనా వ్యాక్సిన్ వేయించాలని కమిషనర్ లోకేష్కుమార్ ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ అధికారులు, పాలనా సిబ్బంది, పారిశుధ్య కార్మికులందరికీ వ్యాక్సిన్ ఇప్పించాలని సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్కుమార్ శుక్రవారం జోనల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సిన్ వేసుకున్న వారి వివరాలు ప్రతిరోజూ ప్రధాన కార్యాలయానికి పంపించడంతో పాటు ఈ వివరాలను కొవిడ్ పోర్టల్లో అప్లోడ్ చేయాలన్నారు. జీహెచ్ఎంసీలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్న దాదాపు 30 వేల మంది వ్యాక్సిన్ వేయించుకొని 15వ తేదీ నుంచి విధిగా కార్యాలయాలకు రావాలని ఆదేశించారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే సందర్శకులను అనుమతించాలని.. ఇందుకోసం వారిని చైతన్య పర్చాలన్నారు.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మార్చి 20 నుంచి ఉద్యోగులు, అధికారులు కరోనా బారిన పడ్డా రు. ఈ నేపథ్యంలో కమిషనర్ పాక్షిక ఆంక్షలు విధించారు. వివిధ సమస్యలపై వచ్చే వారు కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదని, తమ సమస్యలను మై-జీహెచ్ఎంసీ యాప్ ద్వారా పంపించాలని కోరా రు. అత్యవసర పనుల కోసం వచ్చే వారిని మధ్యా హ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అనుమతించారు. ఫలితంగా గడిచిన పదిహేను రోజులుగా కొత్తగా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు.