IND Vs WI | సుదీర్ఘ కాలంగా భారత బ్యాటింగ్కు వెన్నెముకలా నిలుస్తున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు రెస్ట్ ఇచ్చి.. వారి స్థానంలో యువ ఆటగాళ్లకు అవకాశమిస్తే.. విండీస్తో రెండో వన్డేలో వాళ్లు నిరాశ పరిచారు. పరీక్ష పెడుతున్న పిచ్పై పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డ యువ ఆటగాళ్లు.. ఒకరి వెంట ఒకరు పెవిలియన్కు వరుస కట్టారు. ఫలితంగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని టీమ్ఇండియా స్వల్ప స్కోరుకే పరిమితమైంది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ సునాయసంగా ఛేదించింది. మూడు వన్డేల సిరీస్ను 1-1తో సమం చేసింది.
బార్బడోస్: వచ్చిన అవకాశాలను టీమ్ఇండియా (Team India) యువ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. పేళవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరుస్తున్నారు. వెస్టిండీస్తో (West Indies) జరుగుతున్న మూడు వన్డేల సిరీస్లో భాగంగా మొదటి మ్యాచ్లో అతి కష్టంగా గెలిచిన భారత్.. బార్బడోస్ (Barbados) వేదికగా కెన్సింగ్టన్ ఓవల్ స్టేడియంలో జరిగిన రెండో వన్డేలో ఏకంగా ఓటమిని మూటగట్టుకున్నది. సెకండ్ వన్డేలో జట్టు యాజమాన్యం సీనియర్లను పక్కనపెట్టిమరీ యంగ్ గన్స్ను బరిలోకి దింపితే అంతగా ఫామ్లో లేని జట్టు చేతిలో ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 181 పరుగులకే ఆలౌట్ అయింది. స్వల్ప లక్ష్యాన్ని కరీబియన్ జట్టు ఆడుతూపాడుతూ ఛేదించింది. దీంతో మూడు మ్యాచ్ వన్డే సిరీస్ను 1-1తో సమంచేసింది.
శనివారం వర్షం అంతరాయం మధ్య సాగిన రెండో మ్యాచ్లో పేలవ ఆట తీరు కనబర్చింది. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకు ఆలౌటైంది. రోహిత్ గైర్హాజరీలో ఈ మ్యాచ్కు పాండ్యా కెప్టెన్గా వ్యవహరించాడు. గత మ్యాచ్లో అర్ధశతకంతో ఆకట్టుకున్న యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ (55 బంతుల్లో 55; 6 ఫోర్లు, ఒక సిక్సర్) మరోసారి హాఫ్సెంచరీతో మెరువగా.. శుభ్మన్ గిల్ (34) పర్వాలేదనిపించాడు. చాన్నాళ్ల తర్వాత తుది జట్టులో చోటు దక్కించుకున్న సంజూ శాంసన్ (9), అక్షర్ (1), పాండ్యా (7), సూర్యకుమార్ (24), జడేజా (10), శార్దూల్ (16) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్, మోతి చెరో మూడు వికెట్లు పడగొట్టారు.
తర్వాత బ్యాటింగుకు దిగిన వెస్టిండీస్ ఆటగాళ్లు నిదానంగా ఆడుతూపాడుతూ విజయాన్ని అందుకున్నారు. షై హోప్ (63), కార్టీ (48), కైల్ మేయర్స్ (36) పరుగులతో రాణించడంతో కేవలం 36.4 ఓవర్లలోనే విండీస్ జట్టు లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు. సిరీస్లో చివరిదైన మూడో వన్డే మంగళవారం (ఆగస్టు 1)న జరుగనుంది.
పుష్కర కాలం తర్వాత స్వదేశంలో వన్డే ప్రపంచకప్ జరుగుతున్న నేపథ్యంలో బలమైన జట్టుతో బరిలోకి దిగాలని భావిస్తున్న టీమ్ఇండియా.. వెస్టిండీస్ పర్యటనతోనే మెగాటోర్నీ సన్నాహకాలు ప్రారంభించింది. వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారి వరల్డ్కప్నకు అర్హత సాధించలేకపోయిన వెస్టిండీస్పై ప్రధాన ఆటగాళ్ల అవసరం లేదనుకున్న టీమ్ మేనేజ్మెంట్.. రెండో వన్డేలో కోహ్లీ, రోహిత్కు రెస్ట్ ఇచ్చి వారి స్థానంలో సంజూ శాంసన్, అక్షర్ పటేల్కు తుది జట్టులో చోటు కల్పించింది. అయితే రాక రాక వచ్చిన అవకాశాన్నీ వీళ్లెవరూ సరిగ్గా వినియోగించుకోలేకపోయారు. ఓపెనర్లు సత్తాచాటడంతో ఒక దశలో 90/0తో ఉన్న భారత జట్టు.. మరో 91 పరుగుల వ్యవధిలో పది వికెట్లు కోల్పోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఐపీఎల్తో పాటు దేశవాళీల్లో రాణించిన ఆటగాళ్లు.. జాతీయ జట్టు తరఫున అదే స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయారు.
ప్రత్యర్థి జట్టులో ప్రచండ బౌలర్లు లేకపోయినా.. అనవసర షాట్లతో వికెట్లు సమర్పించుకున్నారు. అథనాజ్ పట్టిన సూపర్ క్యాచ్కు ఇషాన్ ఇన్నింగ్స్కు తెరపడగా.. సంజూ శాంసన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ తప్పుడు షాట్ సెలెక్షన్తోనే పెవిలియన్ బాటపట్టారు. ఇటీవల వన్డే ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఇంతకన్నా మెరుగైన ఆటగాళ్లు ఉన్న వెస్టిండీస్.. స్కాట్లాండ్, జింబాబ్వే, నెదర్లాండ్స్ వంటి చిన్న జట్ల చేతిలోనూ ఓడి ఘోర అవమానం మూటగట్టుకుంది. అలాంటి జట్టుపై మన ఐపీఎల్ హీరోలు ఏమాత్రం ప్రభావం చూపలేకపోవడం మేనేజ్మెంట్ను కలవరపాటుకు గురిచేస్తున్నది. బ్యాటింగ్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ వంటి యాంకర్ రోల్ పోషించే వాళ్లు లేకపోతే మన వాళ్లు చేతులెత్తేయడం ఖాయమే అని ఈ మ్యాచ్తో నిరూపితమైంది. పిచ్ కష్టంగా ఉందని సర్దిచెప్పుకుందాం అనుకుంటే.. ఎంత కఠిన పిచ్పై అయినా.. ఈ తరహా ఆటతీరు మాత్ర అక్షేపణీయం కాదు. మెగాటోర్నీకి నిండా మూడు నెలలు కూడా లేని తరుణంలో మేనేజ్మెంట్ ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవాల్సిన అవసరం ఉంది. మ్యాచ్ ఆరంభానికి ముందు హార్దిక్ మాట్లాడుతూ.. ‘కొన్ని ప్రశ్నలకు సమాధానం వెతకాలనుకుంటున్నాం’ అని చెప్పనైతే చెప్పాడు కానీ.. మన ఇన్నింగ్స్ ముగిసే సరికి మరిన్ని ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయనేది కాదనలేని వాస్తవం.