బ్రిడ్జ్టౌన్: మిడిలార్డర్ ఆటగాడు రావ్మన్ పావెల్ (53 బంతుల్లో 107; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) మెరుపు సెంచరీతో చెలరేగడంతో ఇంగ్లండ్తో జరిగిన మూడో టీ20లో వెస్టిండీస్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐదు మ్యాచ్ల సిరీస్లో ప్రస్తుతం కరీబియన్ జట్టు 2-1తో ముందంజలో నిలిచింది. బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. పావెల్ శతక్కొట్టగా.. నికోలస్ పూరన్ (43 బంతుల్లో 70; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) తుపాను ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో మిల్స్, లివింగ్స్టోన్, ఆదిల్ రషీద్, గార్టన్, టాప్లే తలా ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారీ లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 204 పరుగులకు పరిమితమైంది. వికెట్ కీపర్ టామ్ బాంటన్ (39 బంతుల్లో 73; 3 ఫోర్లు, 6 సిక్సర్లు), ఫిల్ సాల్ట్ (24 బంతుల్లో 57; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మినహా తక్కినవాళ్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ 3, పొలార్డ్ రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీతో విజృంభించిన పావెల్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.