ఫొటోలకు ఫోజులివ్వడం కోసం పశ్చిమబెంగాల్ గవర్నర్ లా గణేషన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. టీమిండియా ఫుట్బాల్ లెజెండ్ సునీల్ ఛెత్రిని పక్కకు తోసేస్తూ గణేషన్ చేసిన ఈ పనికి నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దిగ్గజ ఫుట్బాల్ ఆటగాడికి ఇవ్వాల్సిన గౌరవం ఇదేనా..? అని గణేషన్పై మండిపడుతున్నారు. అసలేం జరిగిందంటే..
భారత్లో అత్యంత ప్రాచీనమైన ఫుట్బాల్ టోర్నీ అయిన డ్యూరాండ్ కప్ (131వ) ఫైనల్లో సునీల్ ఛెత్రి సారథ్యం వహిస్తున్న బెంగళూరు ఫుట్బాల్ క్లబ్.. 2-1 తేడాతో ముంబై సిటీపై గెలిచింది. ఆదివారం కోల్కతా వేదికగా ముగిసిన ఈ మ్యాచ్లో విజేతలకు ట్రోఫీని అందించడానికి వెస్ట్ బెంగాల్ గవర్నర్ (ఇంచార్జి) లా గణేషన్ కూడా వచ్చారు.
అయితే ట్రోఫీ అందజేసేప్పుడు వేదికమీద గవర్నర్తో పాటు స్థానిక మంత్రులు, క్రీడాకారులు ఉన్నారు. ట్రోఫీని అందజేస్తూ గణేషన్.. ఫొటోలు తీస్తున్నవారికి అడ్డుగా ఉన్నాడని ఛెత్రిని పక్కకు తోసేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. గణేషన్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్లో అత్యధిక గోల్స్ కొట్టిన ఫుట్బాలర్ల జాబితాలో సునీల్ ఛెత్రి ప్రస్తుతం ఐదో స్థానం (84 గోల్స్) లో ఉన్నాడు. దిగ్గజ ఆటగాళ్లు మెస్సీ (86), క్రిస్టియానో రొనాల్డో (117) ఛెత్రికంటే ముందున్నారు. అంతటి ఖ్యాతిగాంచిన ఛెత్రితో గవర్నర్ ఇలా వ్యవహరించడం సరికాదని, ఇది సిగ్గుచేటు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా కూడా ‘ఇది అవమానకరం’ అని కామెంట్ చేశాడు.
WB Governor pushing away captain Sunil Chhetri the winner of Durand cup 2022 to stay in the limelight.
The captain should have walked away pic.twitter.com/kqAPGxjx5j
— Rocks (@naikrakesh) September 19, 2022