దుబాయ్: క్రికెట్లో ఓవరాల్గా ఇండియాపై పాకిస్థాన్కే మెరుగైన రికార్డు ఉంది. వన్డేలు, టెస్టుల్లో టీమిండియాపై పాక్దే పైచేయి. 59 టెస్టుల్లో 12, 132 వన్డేల్లో 73 గెలిచి ఇండియా కంటే క్రికెట్లో తమదే బెటర్ టీమ్ అని చెప్పుకుంటోంది. ఒక్క టీ20ల్లో మాత్రమే ఇండియా ముందుంది. ఆరు మ్యాచ్లలో 5 ఇండియా, ఒకదాంట్లో పాక్ గెలిచింది. అయితే వరల్డ్కప్ విషయానికి వస్తే పరిస్థితి తారుమారవుతోంది. వన్డే, టీ20 వరల్డ్కప్( T20 World Cup )లు అన్నింట్లోనూ పాక్పై ఇండియానే గెలిచింది. అందుకే ఏదైనా వరల్డ్కప్లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ ఉందంటే చాలు.. ఈసారి ఎలాగైనా ఫలితం తారుమారు చేయాలని దాయాది భావిస్తుంది.
ఇప్పుడు కూడా ఈ కీలకమైన మ్యాచ్కు ముందు పాక్ కెప్టెన్ బాబర్ ఆజం.. విజయంపై ఆశలు పెట్టుకున్నాడు. రెండున్నరేళ్ల తర్వాత జరుగుతున్న ఇండోపాక్ పోరులో తప్పక విజయం సాధిస్తామని బాబర్ అన్నాడు. ఐసీసీతో మాట్లాడిన అతడు.. ఈ మధ్య కాలంలో యూఏఈలో ఆడిన అనుభవం తమకు కలిసొస్తుందని చెప్పాడు. ప్రతి మ్యాచ్లో ఉండే ఒత్తిడి, తీవ్రత మాకు తెలుసు. ముఖ్యంగా తొలి మ్యాచ్. అయితే ఈసారి తొలి మ్యాచ్లోనే గెలిచి అదే దూకుడును కొనసాగిస్తామన్న నమ్మకం ఉంది. గత మూడు, నాలుగేళ్లుగా యూఏఈలో మ్యాచ్లు ఆడుతున్నాం. అక్కడి కండిషన్స్ మాకు బాగా తెలుసు. పిచ్ ఎలా మారుతుంది, అందుకు తగినట్లుగా ఎలా మార్పులు చేసుకోవాలో బ్యాటర్లకు తెలుసు. ఆ రోజు ఎవరు మెరుగ్గా ఆడతారో వాళ్లే గెలుస్తారు. నన్ను అడిగితే, మేమే గెలుస్తామని చెప్పగలను అని బాబర్ ఆజం అన్నాడు.
చాలా ఆత్మవిశ్వాసంతో తమ టీమ్ బరిలోకి దిగబోతోందని బాబర్ చెప్పాడు. గతం గురించి కాదు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాం. దాని కోసమే సిద్ధమవుతున్నాం. ఆ రోజు మెరుగైన క్రికెట్ ఆడతాం అని బాబర్ స్పష్టం చేశాడు. పాకిస్థాన్కు 28 టీ20ల్లో బాబర్ కెప్టెన్గా వ్యవహరించాడు. ముఖ్యంగా యూఏఈలో అందులోనూ ఇప్పుడు ఇండో, పాక్ మ్యాచ్ జరగబోయే దుబాయ్లో 2016 నుంచి 6 టీ20 ఆడిన ఆ టీమ్ అన్నింట్లోనూ గెలవడం విశేషం.