Babar Azam: వన్డే వరల్డ్ కప్ సెమీస్ రేసు నుంచి అనధికారికంగా నిష్క్రమించినా పాకిస్తాన్ ముందుంజ వేయడానికి మరో అవకాశం అయితే ఉంది. శనివారం కోల్కతాలోని ఈడెన్ గార్డెన్ వేదికగా ఇంగ్లండ్తో జరుగబోయే మ్యాచ్లో గనక పాకిస్తాన్.. క్రికెట్ చరిత్రలోనే ఇప్పటివరకూ కనీవినీ ఎరగనంత భారీ స్థాయిలో విజయాన్ని సాధిస్తే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలుంటాయి. అయితే ఇలా చేయడానికి తమ వద్ద ప్లాన్స్ ఉన్నాయంటున్నాడు పాకిస్తాన్ సారథి బాబర్ ఆజమ్. ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న బాబర్ ఈ మ్యాచ్తో పాటు తన ఫామ్పై వస్తున్న విమర్శలపై స్పందించాడు.
బాబర్ మాట్లాడుతూ.. ‘మా దృష్టి మొత్తం నెట్ రన్ రేట్ మీదే ఉంది. అలా అని మేం తొలి బంతి నుంచే బాదుడు మొదలుపెట్టి దొరికిన బాల్ను దొరికినట్టుగా గుడ్డిగా బాదలేం. మేం హిట్టింగ్కు దిగుతాం కానీ అది ప్లానింగ్ ప్రకారం చేస్తాం. పవర్ ప్లే ఓవర్లతో పాటు ఫకర్ జమాన్ ఒక 20 ఓవర్లు క్రీజులో ఉండి మంచి భాగస్వామ్యాలు నమోదుచేస్తే మేం భారీ స్కోరు నమోదుచేసే అవకాశం ఉంది. ఈ టోర్నీలో మాకు ఇంకా ఒక్క మ్యాచ్ మిగిలే ఉంది. ఇప్పుడే అంతా అయిపోయినట్టు కాదు. క్రికెట్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరికి తెలుసు..?’ అని అన్నాడు.
Babar Azam said “We have planned about the net-run rate against England”. [Sports Hour] pic.twitter.com/gJZxiB4y1V
— Johns. (@CricCrazyJohns) November 10, 2023
ఇక తన పేలవ ఫామ్పై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ..‘వరల్డ్ కప్లో చాలా మంది నేను స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదని అంటున్నారు. నేను ఒత్తిడిలో ఉన్నానని వాళ్లు ఊహించుకుంటున్నారు. వాస్తవానికి నాపై ఎలాంటి ఒత్తిడీ లేదు. టీవీల ముందు కూర్చుని మాట్లాడటం చాలా ఈజీ. నాపై విమర్శలు చేస్తున్నవారందరి దగ్గరా నా ఫోన్ నెంబర్ ఉంది. వాళ్లు నాకేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే నేరుగా నాకు మెసేజ్ చేయొచ్చు.. ’ అని తెలిపాడు.