భారత్-ఇంగ్లండ్ మధ్య ముగిసిన ఐదో టెస్టులో టీమిండియా నిర్దేశించిన 378 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చారిత్రాత్మక విజయం అందుకుంది ఆతిథ్య జట్టు. దాంతో ఈ సిరీస్ ను 2-2 తో సమం చేసింది. ఇక బెన్ స్టోక్స్ సారథ్య పగ్గాలు చేపట్టాక అతడికి ఇది వరుసగా నాలుగో విజయం. ఈ మ్యాచ్ అనంతరం స్టోక్స్ మాట్లాడుతూ.. టీమిండియా తమ ముందు 450 టార్గెట్ పెడుతుందని భావించానని చెప్పాడు.
ఐదో టెస్టు ముగిశాక స్టోక్స్ మాట్లాడుతూ.. ‘మీరేం చేయగలరు అనేదానిపై డ్రెస్సింగ్ రూమ్ లోనే క్లారిటీ ఉంటే గ్రౌండ్ లో దానిని సాధించడం పెద్ద కష్టమైన విషయమేమీ కాదు. అప్పుడు మనం చేయాల్సిన పని కూడా సులువవుతంది. అంతర్జాతీయ క్రికెట్ లో 378 భారీ లక్ష్యమే కావొచ్చు. కొన్ని వారాల క్రితం మాకు కూడా అలాగే ఉండేది. కానీ ఇప్పుడు కాదు..
నేనైతే ఈ టెస్టులో టీమిండియా మాకు 450 పరుగుల టార్గెట్ పెడుతుందని అనుకున్నా. ఒకవేళ వాళ్లు 450 పెట్టినా మా ఆటగాళ్లు ఏం చేస్తారు..? ఎలా ఛేదిస్తారు..? అనేది చూద్దామనుకున్నా..’అని తెలిపాడు. తమ జట్టు దృక్పథం పూర్తిగా మారిందని.. టెస్టు క్రికెట్ లో తాము సరికొత్త చరిత్ర రాసేందుకు సిద్ధంగా ఉన్నామని స్టోక్స్ వెల్లడించాడు.
ఇండియాతో రీషెడ్యూల్డ్ టెస్టుకు ముందే ఇంగ్లండ్.. న్యూజిలాండ్ తో ముగిసిన మూడు టెస్టుల సిరీస్ లో కూడా నాలుగో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసి విజయాన్ని అందుకుంది. ఆ సిరీస్ లో ఇంగ్లీష్ జట్టు.. 277, 299, 296 పరుగుల లక్ష్యాలను విజయవంతంగా ఛేదించింది. ఈ టెస్టులో 378 పరుగులను ఛేదించి తమ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని విజయవంతంగా పూర్తి చేసింది.