టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మైదానంలో తన దూకుడైన ఆటతో పరుగుల వరద పారించే కోహ్లీ ఇప్పటికే చాలా కంపెనీలు, సంస్థలకు ప్రచారకర్తగా ఉన్నాడు. మరో రెండు రోజుల్లో ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంకానుండగా, ప్రముఖ చైనీస్ స్మార్ట్ఫోన్ మేకర్ వివో తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్గా కోహ్లీని నియమించుకున్నట్లు బుధవారం ప్రకటించింది.
మిలీనియల్స్, టెక్నాలజీపై ఆసక్తి కనబర్చే వినియోగదారులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు కంపెనీ పేర్కొంది. వివో తీసుకొచ్చే ఉత్పత్తులను కోహ్లీ విడుదల చేయడంతో పాటు వాటిపై అవగాహన కల్పించనున్నాడు. వివో ప్రస్తుతం ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. భారత మార్కెట్లో స్మార్ట్ఫోన్ బ్రాండ్లు షియోమీ, శాంసంగ్లకు వివో గట్టిపోటీనిస్తోంది.