న్యూఢిల్లీ: లీడర్గా కొనసాగేందుకు.. కెప్టెన్సీతో సంబంధం లేదని టీమ్ఇండియా తాజా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ పరాజయం అనంతరం సుదీర్ఘ ఫార్మాట్ సారథ్యానికి వీడ్కోలు పలికిన విరాట్.. సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘జట్టులో నాయకుడిగా ఉండటానికి.. కెప్టెన్సీతో సంబంధం లేదు. దీనికి మహేంద్రసింగ్ ధోనీనే అత్యుత్తమ ఉదాహరణ. ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత కూడా అతడి స్థాయి తగ్గలేదు. జట్టులో కొనసాగినంత కాలం మహీ నుంచి సలహాలు తీసుకునేవాళ్లం. కెప్టెన్సీని వదిలి ముందుకు సాగడం కూడా నాయకుడి లక్షణమే. కాకపోతే మన నిర్ణయాన్ని వెల్లడించేందుకు సరైన సమయాన్ని ఎంపిక చేసుకోవాలి. ఇక ముందు ఆటగాడిగా కీలక పాత్ర పోషించాలనుకుంటున్నా. గతంలో ధోనీ కెప్టెన్సీలో నేను ఆడా. ఆ తర్వాత కెప్టెన్గా పని చేశా. అప్పుడూ, ఇప్పుడూ నా మైండ్సెట్ ఒకేలా ఉంటుంది. జట్టులో సాధారణ ఆటగాడిగా కొనసాగినా.. నేనెప్పుడూ కెప్టెన్ లాగానే ఆలోచిస్తా. గెలుపోటములు మన చేతిలో ఉండవు.. కానీ, జట్టు కోసం ఎల్లప్పుడూ అత్యుత్తమంగా రాణించేందుకు ప్రయత్నించాలి. ఎవరికైనా వారి లక్ష్యాలపై అవగాహన ఉండాలి. మన కెరీర్ ముగిసేలోగా వాటిని సాధించామా? లేదా అనే విషయాన్ని పరీక్షించుకోవాలి. ప్రతి దానికి ఓ ముగింపు ఉంటుందని గ్రహించినప్పుడే.. మన పాత్రకు పూర్తి న్యాయం చేయగలుగుతాం’ అని అన్నాడు. భారత్లో నైపుణ్యమున్న ఆటగాళ్లకు కొదవ లేదని.. నాణ్యమైన ఆటగాళ్లను గుర్తించి వారిని మరింత తీర్చిదిద్దాలని కోహ్లీ సూచించాడు. తన కెప్టెన్సీలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మనం గెలువగలమనే నమ్మకాన్ని జట్టు సభ్యుల్లో తీసుకొచ్చేందుకు ప్రయత్నించినట్లు విరాట్ వెల్లడించాడు.
అహ్మదాబాద్ చేరిన టీమ్ఇండియా
అహ్మదాబాద్: సఫారీ టూర్లో అనూహ్య పరాజయాలు.. సారథ్య మార్పులతో నెల రోజులుగా వార్తల్లో నిలిచిన టీమ్ఇండియా.. తిరిగి మైదానంలో అడుగు పెట్టేందుకు సిద్ధమవుతున్నది. వెస్టిండీస్తో మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ కోసం భారత జట్టు.. అహ్మదాబాద్ చేరుకుంది. ఈ నెల 6న ఇరు జట్ల మధ్య ఇక్కడ తొలి వన్డే జరుగనుండగా.. ఆటగాళ్లంతా బయోబబుల్లోకి చేరుకున్నారు. మొదటి మూడు రోజుల క్వారంటైన్ అనంతరం.. ప్లేయర్లు ప్రాక్టీస్ ప్రారంభించనున్నట్లు బీసీసీఐ అధికారి తెలిపారు. రెగ్యులర్ కెప్టెన్గా ఎంపికైన తర్వాత రోహిత్ శర్మకు ఇదే తొలి వన్డే సిరీస్ కాగా.. గాయం నుంచి కోలుకున్న హిట్మ్యాన్ సత్తాచాటేందుకు తహతహలాడుతున్నాడు.
ఇక రికార్డుల వేటే..పాంటింగ్ ప్రశంసల జల్లు
దుబాయ్: కెప్టెన్సీ బాధ్యతలను పక్కనపెట్టిన భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇక ముందు బ్యాటింగ్ రికార్డులు బద్దలు కొడతాడని ఆస్ట్రేలియా మాజీ సారథి రికీ పాంటింగ్ అభిప్రాయపడ్డాడు. ఏడేండ్లు భారత జట్టును విజయ పథాన నడిపించిన విరాట్.. కెప్టెన్సీ నుంచి తప్పుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందని అన్నాడు. సోమవారం పాంటింగ్ మాట్లాడుతూ.. ‘గతేడాది విరాట్తో మాట్లాడినప్పుడు పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి వీడ్కోలు పలుకుతానని చెప్పాడు. కానీ, టెస్టు సారథ్యం నుంచి తప్పుకోవడం నన్ను షాక్కు గురిచేసింది. టెస్టుల్లో అతడి ప్రదర్శన నాకెంతో ఇష్టం. ఓ గంట సేపు కోహ్లీని మైదానంలో చూస్తే చాలు అతడు టీమ్ఇండియా టెస్టు కెప్టెన్గా ఉండటానికి ఎంత ఆసక్తితో ఉంటాడో తెలుస్తుంది’ అని అన్నాడు. కోహ్లీ సారథికాక ముందు టీమ్ఇండియా గురించి ఆలోచిస్తే.. స్వదేశంలోనే ఎక్కువ ప్రభావం చూపేదని.. ఆ తర్వాత విదేశాల్లో దుమ్మురేపడం ప్రారంభించిందని పాంటింగ్ గుర్తుచేసుకున్నాడు.