Virat Kohli : తొలి వన్డేలో క్లాస్ ఇన్నింగ్స్తో శతకం బాదిన విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డులు బద్ధలు కొట్టాడు. వన్డేల్లో 45వ, అంతర్జాతీయ క్రికెట్లో 73వ శతకం సాధించిన అతను టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ రికార్డును సమం చేశాడు. స్వదేశంలో 20 సెంచరీలు చేసిన రెండో బ్యాటర్గా గుర్తింపు సాధించాడు. స్వదేశంలో తక్కువ ఇన్నింగ్స్ల్లో 20 సెంచరీలు కొట్టిన బ్యాటర్గా రికార్డు క్రియేట్ చేశాడు. 99 ఇన్నింగ్స్ల్లోనే కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ 20 సెంచరీలకు 160 ఇన్సింగ్స్లు తీసుకున్నాడు. సొంత గడ్డపై అత్యధిక శతకాలు బాదిన వాళ్లలో దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు హషీం ఆమ్లా (69 ఇన్నింగ్స్), ఆసీస్ మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ (151 ఇన్నింగ్స్)తలా 14 శతకాలతో మూడో స్థానంలో ఉన్నారు.
ఒకే జట్టు మీద అత్యధిక సెంచరీలతో సచిన్ రికార్డును కోహ్లీ సమం చేశాడు. శ్రీలంక, వెస్టిండీస్ జట్ల మీద 9 సార్లు అతను వంద పరుగులు చేశాడు. సచిన్, ఆస్ట్రేలియా మీద 9 సెంచరీలు కొట్టాడు. రోహిత్ శర్మ, ఆసీస్పై 8 సెంచరీలతో మూడో స్థానంలో ఉన్నాడు. పోయిన ఏడాది బంగ్లాదేశ్తో జరిగిన మూడో వన్డేలో కోహ్లీ సెంచరీ కొట్టాడు. అదే ఫామ్ను కొనసాగిస్తూ గువాహటిలో జరుగుతున్న తొలి వన్డేలో శ్రీలంక బౌలర్లను ఉతికి ఆరేశాడు. 80 బంతుల్లోనే 11 ఫోర్లు 1 సిక్సర్తో సెంచరీకి చేరువయ్యాడు. దాంతో టీమిండియా 373 రన్స్ చేసి, లంక ముందు కొండంత లక్ష్యాన్ని పెట్టింది.