ముంబై: అంతర్జాతీయ క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డులను డ్యాషింగ్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఒక్కొక్కటి బ్రేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల వన్డేల్లో 50వ సెంచరీ చేసిన కోహ్లీ.. సచిన్ పేరిట ఉన్న 49 వన్డే సెంచరీల మైలురాయిని దాటేశాడు. అయితే ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్లో సరిగ్గా వంద సెంచరీలు చేసిన ఘనత సచిన్ పేరిటే ఉంది. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో కోహ్లీ మొత్తం 80 సెంచరీలు చేశాడు. ఈ నేపథ్యంలో అడిగిన ప్రశ్నకు మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ బదులిస్తూ.. సచిన్ వంద సెంచరీల రికార్డును కోహ్లీ బ్రేక్ చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. విరాట్ కోహ్లీ ఆడుతున్న తీరును చూస్తుంటే ఏదైనా సాధ్యమే అనిపిస్తోందన్నాడు. వన్డేల్లో అతను మరిన్ని సెంచరీలు చేస్తాడన్న నమ్మకం ఉందన్నాడు. వన్డేల్లో 71 హాఫ్ సెంచరీలు, 50 సెంచరీలు ఉన్నాయని, ఇదేమీ నవ్వులాట కాదు అని కోహ్లీని యువీ మెచ్చుకున్నాడు.
ప్రస్తుతం భారత జట్టు కాంబినేషన్ బాగుందని, జట్టులో అయిదుగురు బ్యాటర్లు ఉన్నారని, ఒకే జట్టులో 8 నుంచి 10 మంది మ్యాచ్ విన్నర్లు ఉన్నట్లు యువీ తెలిపారు. ఇలాంటి శక్తివంతమైన జట్టును ఆస్ట్రేలియా వద్ద 2003-07 సమయంలో చూశామని, స్పోర్ట్స్ తక్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను పేర్కొన్నాడు.