ప్రస్తుతం భారత క్రికెట్లో అతి పెద్ద డ్రామా జరుగుతోంది. ఇదంతా కోహ్లీని వన్డే కెప్టెన్గా తొలగించడంతో మొదలైంది. టీ20 కెప్టెన్సీ వదులుకునే సమయంలోనే తామంతా కోహ్లీని వారించామని సాక్షాత్తు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే పలు ఇంటర్వ్యూల్లో చెప్పాడు. కానీ అలాంటిదేమీ లేదని, కెప్టెన్గా తొలగించిన విషయాన్ని కూడా సౌతాఫ్రికా టూర్కు జట్టును ప్రకటించే గంటన్నర ముందు చెప్పారని కోహ్లీ స్పష్టంగా చెప్పాడు.
అనంతరం విమానం ఎక్కేసి సౌతాఫ్రికా బయలుదేరాడు. ఇప్పుడు ఈ సిరీస్.. సారధిగా, ఆటగాడిగా కోహ్లీకి చాలా కీలకమని పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ దినేష్ కనేరియా అభిప్రాయపడ్డాడు. తనను సడెన్గా కెప్టెన్సీ నుంచి తొలగించిన బీసీసీఐకి కోహ్లీ సమాధానం చెప్పాలంటే ఈ టోర్నీలో రాణించాలి. దక్షిణాఫ్రికాలో టెస్టు సిరీస్ గెలవాలి. తన సత్తా నిరూపించుకోవాలి అని కనేరియా చెప్పాడు.
కెప్టెన్గా కోహ్లీకి లభించే చివరి అవకాశం ఇదేనని ఈ మాజీ స్పిన్నర్ అభిప్రాయపడ్డాడు. కాగా, 1992 నుంచి ఇప్పటి వరకూ భారత జట్టు దక్షిణాఫ్రికాలో ఒక్క టెస్టు సిరీస్ కూడా గెలవలేదు. కోహ్లీ హయాంలో అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ దేశాల్లో టెస్టు సిరీస్లు గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికాలో మాత్రం విజయం రుచి చూడలేదు. చివరగా కోహ్లీ సారధ్యంలో దక్షిణాఫ్రికాలో ఆడిన భారత జట్టు 2-1తో సిరీస్ కోల్పోయింది.