దుబాయ్: ఓటమి తర్వాత ఎన్నో విమర్శలు, విశ్లేషణలు సహజమే. అందులోనూ పాకిస్థాన్ చేతుల్లో, తొలిసారి ఓ వరల్డ్కప్ మ్యాచ్లో.. ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓడినప్పుడు ఈ విమర్శలు, విశ్లేషణలు మరింత పదును తేలుతాయి. ఇప్పుడు జరుగుతోంది అదే. ప్రత్యేకంగా ఈ మెగా టోర్నీ కోసమే మహేంద్ర సింగ్ ధోనీని టీమిండియా మెంటార్గా నియమించింది బీసీసీఐ. అతడు ఫీల్డ్లో నేరుగా లేకపోయినా.. బౌండరీ బయటి నుంచి అతడు ఇచ్చే సలహాలు, సూచనలు టీమ్కు ఎంతగానో పనికొస్తాయని బోర్డు భావించింది.
అందుకు తగినట్లే ఎంతో కీలకమైన తొలి మ్యాచ్లోనే ధోనీ తన పని మొదలుపెట్టాడు. టీమిండియా ఫీల్డింగ్, బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ధోనీ ఎప్పటికప్పుడు తన సందేశాన్ని ఫీల్డ్లోని విరాట్ కోహ్లికి పంపించే ప్రయత్నం చేశాడు. దీనికోసం ఇషాన్ కిషన్ను అతడు ఎంచుకున్నాడు. ఎప్పుడు కాస్త సమయం దొరికినా.. వాటర్ బాటిల్స్ లేదంటే బ్యాట్లు పట్టుకొని ఫీల్డ్లోకి పరుగెత్తుకొచ్చిన ఇషాన్ కిషన్.. ధోనీ సందేశాన్ని విరాట్కు చేరవేసే ప్రయత్నం చేశాడు.
అయితే కోహ్లి మాత్రం వాటిని పట్టించుకోకుండా సొంత నిర్ణయాలకే కట్టుబడి ఉన్నట్లు మ్యాచ్ చూస్తే స్పష్టమవుతోంది. కోహ్లి, పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో తర్వాత ఎవరు బ్యాటింగ్కు రావాలో క్రీజులో నుంచే డ్రెస్సింగ్ రూమ్కు సందేశం పంపించాడు విరాట్. రైట్హ్యాండ్ అయిన తాను ఔటైతే హార్దిక్, పంత్ ఔటైతే జడేజా రావాలన్నది అతని ప్లాన్. అందుకు తగినట్లే పంత్ ఔటవగానే జడేజా వచ్చాడు. ఈ విషయంలో ధోనీ ఇచ్చిన సూచనను కోహ్లి పట్టించుకోలేదు. 15 ఓవర్లు పూర్తయినా కూడా కోహ్లి, జడేజా స్కోరు వేగాన్ని పెంచలేకపోయారు. ఇది భారీ స్కోరు చేసే అవకాశాన్ని దెబ్బతీసింది.
ఇక ఫీల్డింగ్ సమయంలోనూ గాయపడిన పాండ్యా స్థానంలో ఇషాన్ కిషన్నే ధోనీ పంపించాడు. అప్పుడు కూడా అతడు ధోనీ సందేశాలను విరాట్కు చేరేవేసే ప్రయత్నం చేశాడు. కానీ కోహ్లి మాత్రం తన నిర్ణయాలనే ఫాలో అయ్యాడు. తొలి నాలుగు ఓవర్లు నలుగురు బౌలర్లకు ఇవ్వడమన్నది కోహ్లి నిర్ణయమే. ఇది బెడసికొట్టి.. మొదట్లోనే పాక్ను ఒత్తిడిలోకి నెట్టే చాన్స్ టీమిండియా కోల్పోయింది.