Virat Kohli | టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి రికార్డులతో అవినాభావ సంబంధం ఉంది. అతడు ఆడిన ప్రతీ మ్యాచ్లో ఏదో ఒక రికార్డును బ్రేక్ చేయడం కోహ్లీకి వెన్నతో పెట్టిన విద్య. అందుకే కోహ్లీని ‘రికార్డుల రారాజు’ అని కూడా అంటారు. బంగ్లాదేశ్తో గురువారం రాత్రి పూణే వేదికగా ముగిసిన మ్యాచ్లో కోహ్లీ శతక్కొట్టడంతో అతడి పలు రికార్డులను బ్రేక్ చేశాడు. ఆ జాబితా ఇక్కడ చూద్దాం.
కలిస్ను దాటి..
బంగ్లాదేశ్తో మ్యాచ్లో సెంచరీ చేయడంతో కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోరు చేసిన ఆటగాళ్ల జాబితాలో జాక్వస్ కలిస్ను దాటేశాడు. కలిస్.. తన కెరీర్లో మొత్తంగా 211 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు చేయగా కోహ్లీ నిన్నటి సెంచరీతో 212కు చేరుకున్నాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (264), రికీ పాంటింగ్ (217), కుమార సంగక్కర (216)లు కోహ్లీ కంటే ముందున్నారు.
నిన్నటి సెంచరీ కోహ్లీకి వన్డేలలో 48వది కాగా ఓవరాల్గా 78వ శతకం కావడం గమనార్హం. కాగా అంతర్జాతీయ కెరీర్లో అత్యంత వేగంగా 26 వేల పరుగులు పూర్తిచేసిన జాబితాలో కోహ్లీ.. మహేళ జయవర్దెనేను దాటేశాడు. జయవర్దెనే.. 725 ఇన్నింగ్స్లలో 25,957 పరుగులు చేయగా కోహ్లీ 567 ఇన్నింగ్స్లలోనే 25,960 పరుగులు పూర్తిచేశాడు. ఈ జాబితాలో సచిన్ (34,357), సంగక్కర (28,016), రికీ పాంటింగ్ (27,483)లు కోహ్లీ కంటే ముందున్నారు.
గేల్ ఖేల్ ఖతం..
ఐసీసీ ఈవెంట్స్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ.. విండీస్ దిగ్గజం క్రిస్ గేల్ ను దాటేశాడు. వన్డే వరల్డ్ కప్తో పాటు టీ20 ప్రపంచకప్లలో కలిసి క్రిస్ గేల్.. 2,942 పరుగులు చేయగా తాజాగా కోహ్లీ 2,959 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. కోహ్లీ, గేల్ తర్వాత సంగక్కర (2,876), జయవర్దెనే (2,858), సచిన్ (2,719), రోహిత్ శర్మ (2,687)లు ఉన్నారు.
ధోని రికార్డు మాయం..
బంగ్లాదేశ్తో విజయంతో కోహ్లీ ధోని రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ఐసీసీ నిర్వహించే మ్యాచ్లలో అత్యధిక విజయాలలో భాగస్వామిగా ఉన్న ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ.. ధోనిని దాటేశాడు. ఐసీసీ ఈవెంట్స్లలో ధోని 52 విజయాలలో భాగస్వామి కాగా తాజా విజయంతో కోహ్లీ 53 విజయాలలో సభ్యుడిగా ఉన్నాడు.