న్యూఢిల్లీ: భారత కుస్తీవీరుల అవార్డుల వాపసీ పరంపర కొనసాగుతున్నది. జాతీయ రెజ్లింగ్ అసోసియేషన్(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్ష ఎన్నికపై రగడ మలుపులు తిరుగుతూనే ఉన్నది. బ్రిజ్భూషణ్ శరణ్సింగ్ సన్నిహితుడైన సంజయ్సింగ్ ఎన్నిక కావడాన్ని నిరసిస్తూ ఇప్పటికే సాక్షి మాలిక్ తన కెరీర్కు వీడ్కోలు పలుకగా, బజరంగ్ పునియా, వీరేందర్సింగ్ బాటలో స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ పయనించింది. ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు సాధించనందుకు తాను అందుకున్న ధ్యాన్చంద్ ఖేల్త్న్ర అవార్డుతో పాటు అర్జున వాపస్ ఇస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది.
మహిళా రెజ్లర్లకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా తన అవార్డులను కేంద్ర ప్రభుత్వానికి వెనుకకు ఇస్తున్నట్లు పేర్కొంది. దేశంలో మహిళా రెజ్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధాని నరేంద్రమోదీకి వినేశ్..ఎక్స్లో లేఖను పోస్ట్ చేసింది. ‘ఖేల్త్న్ర, అర్జున అవార్డులకు ప్రస్తుతం నా జీవితంలో సరైన విలువలేవు. దేశంలో ప్రతీ మహిళా గౌరవంగా బతకాలని అనుకుంటున్నది. అందుకే బరువు తొలిగించుకునేందుకు ఈ అవార్డులు వాపస్ ఇస్తున్నాం పీఎం సార్. 2016 రియో ఒలింపిక్స్లో సాక్షి మాలిక్ పతకం గెలిచినప్పుడు మీరు ‘బేటీ బచావో..బేటీ పడావో’కు ఆమెను ప్రచారకర్తగా ప్రకటించారు. అప్పుడు సాటి మహిళలుగా అందరం గర్వపడ్డాం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాక్షి కెరీర్కు వీడ్కోలు పలుకడం చాలా బాధగా ఉంది. మేము ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తలుగా మాత్రమే పనికొస్తామా? మీ ప్రభుత్వం మహిళా సాధికారత పట్ల సీరియస్గా ఉంటే మా సమస్యలపై దృష్టి పెట్టండి’ అని రాసుకొచ్చింది. సంజయ్సింగ్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే క్రీడాశాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.