బెంగళూరు: ప్రొ కబడ్డీ లీగ్ (పీకేఎల్) ఎనిమిదో సీజన్లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతున్నది. ప్రత్యర్థులు మారుతున్నా.. ఫలితం మాత్రం మారడం లేదు. శనివారం జరిగిన పోరులో హైదరాబాద్ 35-39తో యూపీ యోధా చేతిలో ఓడింది. గత మ్యాచ్లో చక్కటి పోరాటం కనబర్చిన పాలమూరు రైడర్ గల్లా రాజు (3 పాయింట్లు)కు ఎక్కువసేపు మ్యాట్పై గడిపే అవకాశం రాకపోగా.. రజనీశ్ (13 పాయింట్లు) ఒక్కడే కాస్త పోరాడాడు. తాజా సీజన్లో 16 మ్యాచ్లాడిన టైటాన్స్ 12 ఓటములు ఎదుర్కొని ఒక్కటంటే ఒక్క విజయం సాధించి 23 పాయింట్లతో పట్టిక అట్టడుగు స్థానంలో కొనసాగుతున్నది. ఇతర మ్యాచ్ల్లో యూ ముంబా 35-33తో తమిళ్ తలైవాస్పై.. హర్యానా స్టీలర్స్ 35-28తో జైపూర్ పింక్ పాంథర్స్పై విజయాలు సాధించాయి.