WPL 2024 Auction: క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్)-2024 మినీ వేలం విజయవంతంగా ముగిసింది. 2024 సీజన్కు గాను బీసీసీఐ
ఆధ్వర్యంలో ముంబై వేదికగా నిర్వహించిన వేలంలో అన్క్యాప్డ్ ప్లేయర్లతో పాటు ఇంతవరకూ పెద్దగా ఆదరణకు నోచుకోని ఆటగాళ్లకే ఫ్రాంచైజీలు పెద్దపీట వేశాయి. వేలంలోకి వచ్చిన స్టార్ ఆల్
రౌండర్లు, పేసర్లు, బ్యాటర్లను కాదని అనామక ఆటగాళ్లను అందలం ఎక్కించాయి. చండీగఢ్కు చెందిన టీమిండియా యువ పేసర్, అన్క్యాప్డ్ ప్లేయర్ కాశ్వీ గౌతమ్ కోసం ఫ్రాంచైజీలు పోటీపడ్డాయి.
ఆమెతో పాటు ఆసీస్ ఆల్ రౌండర్ అన్నాబెల్ సదర్లాండ్లు రూ. 2 కోట్లతో జాక్పాట్ కొట్టారు. భారత్ నుంచి మరో అన్క్యాప్డ్ క్రికెటర్ వృందా దినేశ్ రూ. 1.3 కోట్లు దక్కించుకోగా ఆసీస్ యువ
సంచలనం ఫోబే లిచ్ఫీల్డ్ కోసం గుజరాత్ జెయింట్స్ కోటి రూపాయలు వెచ్చించింది.
30 స్లాట్స్ మాత్రమే ఉన్న మినీ వేలంలో 165 మంది ఆటగాళ్లు అదృష్టం పరీక్షించుకున్నారు. ఐదు ఫ్రాంచైజీ (ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ జెయింట్స్, యూపీ వారియర్స్, ఢిల్లీ క్యాపిటల్స్)లు మొత్తంగా రూ. 12.75 కోట్లు ఖర్చు చేశాయి. ఈ వేలంలో ఐదుగురు క్రికెటర్లు మాత్రమే కోటి, ఆపైన నగదును దక్కించుకోవడం విశేషం. 30 మందిలో 21 మంది భారత ఆటగాళ్లు కాగా 9 మంది విదేశీ క్రికెటర్లున్నారు.
1. కాశ్వీ గౌతమ్ – 20 ఏండ్ల ఈ యువ బౌలింగ్ ఆల్ రౌండర్ రూ. 10 లక్షలతో వేలంలోకి రాగా ఆర్సీబీ, గుజరాత్, యూపీలు ఆమె కోసం పోటీపడ్డాయి. చివరికి గుజరాత్ జెయింట్స్ ఆమెకు రూ. 2 కోట్లు
వెచ్చించి దక్కించుకుంది. డబ్ల్యూపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ప్లేయర్స్లో అత్యధిక ధర పలికింది కాశ్వీకే కావడం విశేషం.
2. అన్నాబెల్ సదర్లాండ్ – ఈ ఆసీస్ ఆల్ రౌండర్ ముంబై, ఢిల్లీలు పోటీపడగా చివరికి ఢిల్లీ.. రూ. 2 కోట్లతో ఆమెను దక్కించుకుంది. ఫారెన్ ప్లేయర్స్లో అన్నాబెల్కే అత్యధిక ధర దక్కింది.
3. వృందా దినేశ్ – బెంగళూరుకు చెందిన ఈ యువ బ్యాటర్ మూడో అత్యధిక ధర దక్కించుకుంది. రూ. 10 లక్షల బిడ్తో ఉన్న ఆమెను యూపీ వారియర్స్ రూ. 1.3 కోట్లకు సొంతం చేసుకుంది.
4. షబ్నమ్ ఇస్మాయిల్– దక్షిణాఫ్రికా పేసర్ ఇస్మాయిల్ కోసం ఆర్సీబీ, గుజరాత్ పోటాపోటిగా బిడ్స్ వేయగా చివరికి ముంబై ఇండియన్స్ ఆమెకోసం రూ. 1.2 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.
5. ఫోబె లిచ్ఫీల్డ్ – 20 ఏండ్ల ఈ ఆసీస్ యువ సంచలనాన్ని గుజరాత్ కోటి రూపాయలతో సొంతం చేసుకుంది. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అయిన లిచ్ఫీల్డ్ కోసం గుజరాత్, యూపీలు పోటీపడ్డాయి.
ఈసారి వేలంలో మంచి ధర దక్కించుకుంటారని భావించిన చాలామంది క్రికెటర్లను ఫ్రాంచైజీలు పట్టించుకోలేదు. ఇందులో స్టార్స్ కూడా ఉన్నారు. విండీస్ ఆల్ రౌండర్ డియెండ్ర డాటిన్, శ్రీలంక సారథి చమారి ఆటపట్టు, ఆసీస్ పేస్ ఆల్ రౌండర్ కిమ్ గార్త్, ఆసీస్ బౌలర్ అలానా కింగ్, యూఎస్ఎ పేసర్ తారా నోరిస్తో పాటు భారత్కు చెందిన ప్రియా పునియా, పూనమ్ రౌత్, దేవికా వైద్య, తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషా వంటి వాళ్లను ఫ్రాంచైజీలు దూరం పెట్టాయి.
వేలంలో గుజరాత్ అత్యధికంగా తొమ్మిది మందిని దక్కించుకోగా, ఆర్సీబీ ఏడుగురిని, యూపీ ఐదుగురిని, ఢిల్లీ ముగ్గురిని, ముంబై ఐదుగురిని సొంతం చేసుకున్నాయి.
మినీ వేలం ముగిసినా ఐదు ఫ్రాంచైజీల వద్ద పర్స్లో మరికొంత నగదు మిగిలింది. ఢిల్లీ వద్ద అత్యల్పంగా రూ. 5 లక్షలు ఉండగా యూపీ వారియర్స్ వద్ద అత్యధికగా రూ. 1.90 కోట్లున్నాయి. ముంబై వద్ద రూ. 45 లక్షలు, గుజరాత్ వద్ద రూ. 1.45 కోట్లు, ఆర్సీబీ వద్ద రూ. 1.05 కోట్ల నగదు ఉంది.