న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఉబర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ నుంచి సిక్కిరెడ్డి-అశ్వినీ పొన్నప్ప జోడీ వైదొలిగింది. బ్యాంకాక్ వేదికగా మే 8 నుంచి షురూ కానున్న టోర్నీకి గాయం కారణంగా సిక్కిరెడ్డి దూరమైంది. ఈ విషయాన్ని భారత బ్యాడ్మింటన్ సంఘం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ‘యువ షట్లర్ సిక్కిరెడ్డి ప్రస్తుతం పొత్తికడుపు గాయంతో బాధపడుతున్నది.గాయం నుంచి పూర్తిగా కోలుకునేందుకు నాలుగు నుంచి ఆరు వారాల పాటు డాక్టర్లు విశ్రాంతి తీసుకోవాలన్నారు. ఈ కారణంగా టోర్నీకి సిక్కి, అశ్విని జోడి దూరమైంది’ అని బాయ్ తెలిపింది. వీరి గైర్హాజరీలో సెలెక్షన్ ట్రయల్స్లో నాలుగో ర్యాంక్లో నిలిచిన సిమ్రన్సింగ్, రితికాను ఎంపిక చేసినట్లు బాయ్ ప్రధాన కార్యదర్శి సంజయ్ మిశ్రా వివరించారు. థామస్, ఉబర్ కప్ టోర్నీలతో పాటు ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్, ఆసియా గేమ్స్ కోసం సెలెక్టర్లు మూడు వేర్వేరు జట్లను ప్రకటించిన సంగతి తెలిసిందే.