దుబాయ్: దుబాయ్ (Dubai) వేదికగా న్యూజిలాండ్తో (New Zealand) జరుగుతున్న మూడు టీ20 మ్యాచ్ల సిరీస్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన రెండో టీ20లో కివీస్కు షాకిచ్చింది. మరో 26 బాల్స్ మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో సిరీస్ను 1-1తో సమంచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ (New Zealand) నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు 142 పరుగులు మాత్రమే చేయగలిగింది. యూఏఈ బౌలర్ల ధాటికి ముగ్గురు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోర్ చేయగలిగారు. వారిలో మార్క్ చాంప్మ్యాన్ 63 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచి జట్టు గౌరవప్రధమైన స్కోర్ చేయడంలో తోడ్పడ్డాడు.
143 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన యూఏఈకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. టిమ్ సౌథీ బౌలింగ్ వేసిన మొదటి ఓవర్లోనే ఓపెనర్ ఆర్యాన్ష్ శర్మ (Aryansh Sharma) పరుగులేమీ చేయకుండా వెనుతిరిగాడు. అయితే ఫస్ట్ డౌన్లో వచ్చిన వ్రిత్య అరవింద్తో (25) కలిసి కెప్టెన్ ముహమ్మద్ వసీమ్ (Muhammad Waseem) జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. 29 బంతుల్లోనే 55 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే మరో బ్యాట్స్మెన్ ఆసిఫ్ ఖాన్ (48) తన విధ్వంసక బ్యాటింగ్తో జట్టును విజయం దిశగా నడిపించాడు. ఇన్నింగ్స్ 16వ ఓవర్లో టిమ్ సౌథీ బౌలింగ్లో మూడు ఫోర్లు కొట్టిన ఆసిఫ్ (Asif Khan) తన టీమ్కు మరపురాని విజయాన్నిఅందించాడు. దీంతో మరో 4.2 ఓవర్లు మిగిలి ఉండగానే 144/3తో మ్యాచ్ ముగిసింది.