ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా అదరగొట్టింది. ట్రావిస్ హెడ్ అజేయ సెంచరీకి స్టీవ్ స్మిత్ సూపర్ ఇన్నింగ్స్ తోడవడంతో తొలి రోజు కంగారూలు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చారు. నలుగురు పేసర్లతో బరిలోకి దిగిన టీమ్ఇండియా.. మొదట బౌలింగ్ ఎంచుకొని మంచి ఆరంభం దక్కించుకున్నా.. ఫలి తం లేకపోయింది. తొలి మూడు వికెట్లను త్వరగానే పడగొట్టినా.. హెడ్, స్మిత్ జోడీని విడదీయలేక భారీగా పరుగులు సమర్పించుకుంది. రెండో రోజు కంగారూలను కట్టడి చేయకపోతే.. ప్రతిష్ఠాత్మక పోరులో రోహిత్ సేన కోలుకోవడం కష్టమే!
లండన్: మిడిలార్డర్ దంచికొట్టడంతో టీమ్ఇండియాతో జరుగుతున్న ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. ట్రావిస్ హెడ్ (156 బంతుల్లో 146 బ్యాటింగ్; 22 ఫోర్లు, ఒక సిక్సర్) వన్డే తరహాలో అజేయ సెంచరీతో చెలరేగగా.. మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ (227 బంతుల్లో 95 బ్యాటింగ్; 14 ఫోర్లు) శతకానికి ఐదు పరుగుల దూరంలో నిలిచాడు. ఫలితంగా తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 3 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసింది. హెడ్, స్మిత్ అభేద్యమైన నాలుగో వికెట్కు 251 పరుగులు జోడించారు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్కు శుభారంభం దక్కినా.. క్రీజులో కుదురుకున్నాక కంగారూలు విజృంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (43; 8 ఫోర్లు), మార్నస్ లబుషేన్ (26) పర్వాలేదనిపించగా.. ఉస్మాన్ ఖవాజా (0) డకౌటయ్యాడు. భారత బౌలర్లలో షమీ, సిరాజ్, శార్దూల్ తలా ఒక వికెట్ పడగొట్టారు. తొలి రోజు సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆసీస్.. రెండో రోజు ఎన్ని పరుగులు జోడిస్తుందనే దానిపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది.
ఆరంభం అదిరినా..
భారత పేసర్ల ధాటికి ఒక దశలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డట్లు కనిపించిన ఆసీస్ను.. హెడ్, స్మిత్ ఆదుకున్నారు. స్మిత్ సంప్రదాయ ఆటతీరు కనబర్చగా.. హెడ్ బౌలర్లపై కౌంటర్ ఎటాక్కు దిగాడు. మంచి బంతులను గౌరవిస్తూనే.. చెత్త బంతులను బౌండ్రీలకు తరలించాడు. తొలి సెషన్లో ఇరు జట్లు సమంగా కనిపించినా.. మిగిలిన రెండు సెషన్లు ఈ ఇద్దరూ ధాటిగా ఆడుతూ కంగారూలను ఆధిక్యంలోకి తీసుకెళ్లారు. షమీ, సిరాజ్ ప్రభావవంతంగా బౌలింగ్ చేసినా.. ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తేలిపోయారు. పిచ్ పేస్కు సహకరిస్తుందనే ఆలోచనతో ఆఫ్ స్పిన్నర్ అశ్విన్ స్థానంలో ఎంపిక చేసుకున్న పేస్ ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ పడగొట్టినా.. అంచనాలను అందుకోలేకపోయాడు. ఆరంభంలో కాస్త ఆచితూచి ఆడిన హెడ్, స్మిత్.. ఒక్కసారి క్రీజులో నిలదొక్కుకున్న తర్వాత బౌండ్రీల వరద పారించారు. తొలి రోజు ఆటలో ఆసీస్ 44 ఫోర్లు నమోదు చేసుకుందంటే.. కంగారూల ఆధిపత్యం ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇషాన్ కిషన్ను కాదని వికెట్ కీపర్గా కేఎస్ భరత్ను ఎంపిక చేసుకోవడం సత్ఫలితాలనివ్వగా.. సారథిగా రోహిత్ శర్మ ఆకట్టుకోలేకపోయాడు. ఆసీస్ కాస్త ఇబ్బందుల్లో ఉన్న సమయంలో వారిపై మరింత ఒత్తిడి పెంచడానికి బదులు వారికి కుదురుకునే అవకాశం ఇచ్చాడు. దీంతో స్వేచ్ఛగా ఆడిన హెడ్ ఎడాపెడా షాట్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 327/3 (హెడ్ 146 బ్యాటింగ్, స్మిత్ 95
బ్యాటింగ్; సిరాజ్ 1/67, శార్దూల్ 1/75).
నల్లరిబ్బన్లతో..
డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు నల్లరిబ్బన్లతో బరిలోకి దిగాయి. ఒడిశా రైలు ప్రమాద ఘటన మృతులకు నివాళులర్పిస్తూ.. మ్యాచ్ ఆరంభానికి ముందు నిమిషం పాటు మౌనం వహించిన ఇరు జట్ల ఆటగాళ్లు.. చేతికి నల్ల రిబ్బన్లతో మైదానంలో అడుగుపెట్టారు.