Bowlers Of Decade : టీ20 లీగ్స్లో మ్యాచ్ విన్నర్లు అంటే ఆల్రౌండర్లే. వైట్బాల్ క్రికెట్(ODI) సంగతి పక్కనపెడితే టెస్టుల్లో మ్యాచ్లను గెలిపించేది నిస్సందేహంగా బౌలర్లే. ముత్తయ్య మురళీధరన్(Muralidharn), షేన్ వార్న్(Shane Warne), గ్లెన్ మెక్గ్రాత్(Glenn Mcgrath), అనిల్ కుంబ్లే(Anil Kumble), చామిందా వాస్(Chaminda Vas) వంటి వారు తమ బౌలింగ్ ప్రతిభతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. అంతేకాదు, బ్యాటర్లకు సింహస్వప్నంగా మారారు. 2010-19 కాలంలో కొందరు బౌలర్లు అత్యద్భుత ప్రదర్శన కనబరిచి గత దశాబ్దంలో అత్యంత విజయవంతమైన బౌలర్లుగా పేరుగాంచారు. వారి ప్రతిభ కారణంగా ఆయా జట్లు చిరస్మరణీయ విజయాలు అందుకున్నాయి. 2010-19 దశాబ్దంలో పదిమంది మోస్ట్ సక్సెస్ఫుల్ బౌలర్ల జాబితాలో ఇండియా నుంచి ఒక్క రవిచంద్రన్ అశ్విన్()కు మాత్రమే చోటు లభించింది.
ఇంగ్లండ్ బౌలర్ జేమ్స్ అండర్సన్(James Anderson) 2010-19 మధ్యకాలంలో అత్యధిక వికెట్లు తీసి టాప్ ప్లేస్లో నిలిచాడు. జిమ్మీ 106 టెస్టులు, 200 ఇన్నింగ్స్లలో 429 వికెట్లు పడగొట్టాడు. అండర్సన్ కారణంగా టెస్టుల్లో ఇంగ్లండ్ అద్వితీయమైన విజయాలు సాధించింది. 2010లో ఆస్ట్రేలియా గడ్డపై ఐదు మ్యాచ్ల యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ మూడు మ్యాచుల్లో గెలిచింది.
జేమ్స్ అండర్సన్
దాంతో, 24 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై యాషెస్ను గెలుచుకుంది. ఆ సిరీస్లో అండర్సన్ 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 2018లో స్వదేశంలో ఇండియాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ అండర్సన్ చెలరేగిపోయాడు. ఐదు టెస్టుల్లో 24 వికెట్లు తీసుకున్నాడు. ఆ సిరీస్ను ఇంగ్లండ్ 4-1తో సొంతం చేసుకుంది.
టీమిండియా అత్యుత్తమ టెస్టు బౌలర్ అయిన రవిచంద్రన్ అశ్విన్(Ravichandran Ashwin) 2010-19 దశాబ్దంలో అద్భుతాలు చేశాడు. 70 టెస్టులు 131 ఇన్నింగ్స్లలో 362 వికెట్లు తీసుకున్నాడు. అశ్విన్ సంచలన బౌలింగ్ కారణంగా 2015లో శ్రీలంక గడ్డపై 22 ఏళ్ల తర్వాత భారత్ టెస్టు సిరీస్ సాధించింది. అశ్విన్ మూడు మ్యాచుల్లో ఏకంగా21 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్గా నిలిచాడు. స్వదేశంలో ఇంగ్లండ్తో 2016లో జరిగిన 5 టెస్టుల సిరీస్ను ఇండియా 4-0తో చేజిక్కించుకుంది. ఆ సిరీస్లో అశ్విన్ ఏకంగా 28 వికెట్లతో ఇంగ్లండ్ను బెంబేలెత్తించాడు.
రవిచంద్రన్ అశ్విన్
ఈ సిరీస్ తర్వాత 2017లో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కోసం కంగారూ జట్టు భారత్లో పర్యటించింది. తొలి టెస్టులో 333 పరుగులతో ఓడిన టీమిండియా.. బెంగళూరులో జరిగిన రెండో టెస్టులో పుంజుకుంది. రవీంద్ర జడేజాతో కలిసి అశ్విన్ ఆసీస్ భరతం పట్టాడు. రెండో ఇన్నింగ్స్లో ఆరుగురు బ్యాటర్లను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. ఫలితంగా పర్యాటక జట్టు 75 పరుగులకు చాపచుట్టేసింది. మొత్తంగా అశ్విన్ నాలుగు టెస్టుల్లో 21 వికెట్లు పడగొట్టాడు.
ఈమధ్యే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్(Stuart Broad) కూడా అదే దశాబ్దంలో అత్యద్భుతంగా రాణించాడు. 111 టెస్టులు, 207 ఇన్నింగ్స్లలో 403 వికెట్లు పడగొట్టాడు. బ్రాడ్ విజృంభణతో 2011లో స్వదేశంలో ఇండియా, శ్రీలంక జట్లను ఇంగ్లండ్ తుక్కురేగ్గొట్టింది. టీమిండియాను అయితే 4-0తో చిత్తుగా ఓడించింది. బ్రాడ్ 4 మ్యాచుల్లో 25 వికెట్లు పడగొట్టి భారత జట్టుకు నిద్రలేకుండా చేశాడు. ఇంగ్లండ్ చివరిసారి 2015లో యాషెస్ సిరీస్ను గెలుచుకుంది.
స్టువర్ట్ బ్రాడ్
స్వదేశంలో జరిగిన ఈ సిరీస్లో ఇంగ్లండ్ 3-2తో విజయం సాధించింది. బ్రాడ్ 21 వికెట్లు నేలకూల్చి బెస్ట్ బౌలర్ ఆఫ్ ద టోర్నీమెంట్గా నిలిచాడు. ట్రెంట్ బ్రిడ్జ్లో జరిగిన నాలుగో టెస్టులో బ్రాడ్ దెబ్బకు ఆసీస్ విలవిల్లాడింది. తొలి ఇన్నింగ్స్లో 60 పరుగులకే కుప్పకూలింది. ఆ మ్యాచ్లో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ 78 పరుగుల భారీ తేడాతో విజయాన్ని అందుకుంది. 2016లో సౌతాఫ్రికాలో జరిగిన బేసిల్ డి`ఒలివీరా ట్రోఫీని ఇంగ్లండ్ 2-1 తేడాతో గెలుచుకుంది. నాలుగు టెస్టులు, 7 ఇన్నింగ్స్లలో బ్రాడ్ 18 వికెట్లు పడగొట్టాడు.
ఆగస్టు 2011లో గాలేలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్తో నాథన్ లయన్(Nathan Lyon) టెస్టు అరంగేట్రం చేశాడు. తొలి మ్యాచ్లో ఆసీస్ 125 పరుగుల తేడాతో విజయం సాధించడంలో లయన్ కీలకపాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ఘనత సాధించాడు. అతడి దెబ్బకు శ్రీలంక 105 పరుగులకే కుప్పకూలింది. 2014లో సౌతాఫ్రికాలో పర్యటించిన ఆసీస్ జట్టులో లయన్ కీలకంగా మారాడు. పోర్టు ఎలిజబెత్లో జరిగిన రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లతో చెలరేగాడు.
నాథన్ లయన్
ఈ ఆఫ్ స్పిన్నర్ 2016-17 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ అద్భుత ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్లు, ఏడు ఇన్నింగ్స్లలో 19 వికెట్లు నేలకూల్చాడు. ఫలితంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆసీస్ తరపున అత్యధిక వికెట్లు నేలకూల్చిన బౌలర్గా స్టీఫెన్ ఒ`కీఫెతో కలిసి రికార్డును పంచుకున్నాడు. 2018లో పాకిస్థాన్లో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం కంగారూ జట్టు యూఏఈలో పర్యటించింది. ఆస్ట్రేలియా 1-0తో సిరీస్ను గెలుచుకుంది. నాలుగు ఇన్నింగ్స్లలో లయన్ 12 వికెట్లు తీసుకున్నాడు. 2010-19 మధ్య లయన్ 95 టెస్టులు ఆడి 182 ఇన్నింగ్స్లలో 380 వికెట్లు నేల కూల్చాడు.
శ్రీలంక టెస్టు క్రికెట్ హీరోల్లో రంగన హెరాత్(Rangana Herath) ఒకడు. 2010-19 కాలంలో శ్రీలంక తరపున 72 టెస్టులు ఆడిన హెరాత్ 133 ఇన్నింగ్స్లలో ఏకంగా 363 వికెట్లు పడగొట్టాడు. 2012లో శ్రీలంక జట్టు ఆసీస్లో పర్యటించినప్పుడు ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాడు.
రంగన హెరాత్
ప్రపంచంలోని అరవీర భయంకర బౌలర్లలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్(Dale Steyn) ఒకడు. ఆ మధ్య కాలంలో 59 టెస్టులు మాత్రమే ఆడిన స్టెయిన్ 108 ఇన్నింగ్స్లలో 267 వికెట్లు తీశాడు. 2012లో ఇంగ్లండ్లో జరిగిన మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను సఫారీ జట్టు 2-0తో గెలుచుకోవడంలో స్టెయిన్ కీలక పాత్ర పోషించాడు. మూడు టెస్టుల్లో 15 వికెట్లు పడగొట్టాడు. అదే ఏడాది ప్రొటీస్ జట్టు మూడు టెస్టుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటించి 1-0తో సిరీస్ గెలుచుకుంది.
డేల్ స్టెయిన్
ఈ సిరీస్ ఐదు ఇన్నింగ్స్లలో స్టెయిన్ 12 వికెట్లు నేలకూల్చాడు. 2013లో యూఏఈలో పాకిస్తాన్తో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. రెండో టెస్టులో మాత్రం స్టెయిన్ దెబ్బకు పాక్ విలవిల్లాడింది. 99 పరుగులకే కుప్పకూలింది. ముఖ్యమైన మూడు వికెట్లు తీసి జట్టు ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో గెలుపొందడంలో కీలకపాత్ర పోషించాడు. ఆ టూర్లో రెండు ఇన్నింగ్స్లలో స్టెయిన్ 13 మంది బ్యాటర్లను పెవిలియన్ పంపాడు.
న్యూజిలాండ్ స్పీడ్ గన్ ట్రెంట్ బౌల్ట్ (Trnet Boult)కు గొప్ప రికార్డు ఉంది. డిసెంబరు 2011లో రెండు టెస్టుల సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. హోబర్ట్లో జరిగిన తొలి మ్యాచ్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన బౌల్ట్ నాలుగు వికెట్లు తీసి అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. ఏడు వికెట్ల తేడాతో జట్టు విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
ట్రెంట్ బౌల్ట్
2014-15లో పాకిస్థాన్తో యూఏఈలో జరిగిన సిరీస్లోనూ బౌల్ట్ దుమ్మురేపాడు. తొలి మ్యాచ్లో ఓడిన కివీస్కు చివరిదైన మూడో మ్యాచ్ డూ ఆర్ డైగా మారింది. ఆ మ్యాచ్లో నాలుగు వికెట్లు తీసిన బౌల్ట్ పాక్ను కోలుకోలేని దెబ్బతీశాడు. దీంతో కివీస్ ఇన్నింగ్స్ 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2015లో ఇంగ్లండ్తో జరిగిన రెండు టెస్టుల్లో ట్రెంట్ బౌల్ట్ ఏకంగా 13 వికెట్లు పడగొట్టాడు. ఆ సిరీస్లో ఇంగ్లండ్ స్కిప్పర్ అలిస్టర్ కుక్తో కలిసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అందుకున్నాడు.
ఆస్ట్రేలియా జట్టులోని అనుభవజ్ఞుడైన పేసర్లలో మిచెల్ స్టార్క్ (Mitchell Starc) ఒకడు. గత దశాబ్దంలో ఆసీస్ జట్టు అత్యంత విజయవంతమైన బౌలర్లలో స్టార్క్ రెండో స్థానంలో ఉన్నాడు. ఈ ఎడమ చేతివాటం పేసర్ 56 టెస్టులు, 107 ఇన్నింగ్స్లలో 240 వికెట్ల తీసుకున్నాడు.
మిచెల్ స్టార్క్
2015 యాషెస్ సిరీస్లో ఐదు టెస్టుల్లో 18 వికెట్లు నేలకూల్చాడు. 2017 యాషెస్లో నాలుగు మ్యాచ్ల్లో 22 వికెట్లు తీసి ఇంగ్లండ్ జట్టును కకావికలం చేశాడు. 2019లో పాకిస్థాన్తో జరిగిన రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ను గెలిచి వైట్వాష్ చేసింది. ఈ సిరీస్లో స్టార్క్ 14 వికెట్లు తీసుకున్నాడు.
పాకిస్థాన్ అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడైన యాసిర్ షా(Yasir Shah) గత దశాబ్దంలో అద్భుత ప్రతిభ కనబర్చాడు. 28 ఏళ్ల వయసులో దుబాయ్లో ఆస్ట్రేలియాతో తొలి టెస్టు ఆడిన అతను అరంగేట్ర మ్యాచ్లోనే ఏడు వికెట్లు పడగొట్టాడు. ఆ మ్యాచ్లో పాక్ 221 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.
యాసిర్ షా
2016లో ఇంగ్లండ్తో జరిగిన నాలుగు మ్యాచ్ల టెస్టు సిరీస్లో షా 19మంది బ్యాటర్లను పెవిలియన్ చేర్చాడు. 2019లో పాక్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి మ్యాచ్లో యాసిర్ షా నాలుగు వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా గత దశాబ్దంలో 38 టెస్టుల్లో 71 ఇన్నింగ్స్లు ఆడి 209 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.
దక్షిణాఫ్రికా పేసర్ వెర్నాన్ ఫిలాండర్(Philander) 2011లో టెస్టు క్రికెట్లో అరంగేట్రం చేశాడు. 2020 వరకు దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. సహచరులు డేల్ స్టెయిన్, మార్నో మార్కెల్తో కలిసి జట్టుకు ఎన్నో అద్వితీయ విజయాలు అందించాడు. 2011-19 మధ్య 61 టెస్టులు ఆడిన ఫిలాండర్114 ఇన్నింగ్స్లలో 220 వికెట్లు నేలకూల్చాడు.
వెర్నాన్ ఫిలాండర్
ఆస్ట్రేలియాతో అరంగేట్ర సిరీస్లో రెండు మ్యాచుల్లో 14 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ అయ్యాడు. కేప్టౌన్లో జరిగిన తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. అతడి సెన్సేషనల్ బౌలింగ్తో ప్రొటీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫిలాండర్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. 2012 ఇంగ్లండ్ పర్యటనలో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్లో 12 వికెట్లు పడగొట్టాడు.