వచ్చిన అథ్లెట్లకు అపూర్వ స్వాగతం లభించింది. ఆదివారం టోక్యోలో ముగింపు వేడుకలు ముగిసిన అనంతరం ఢిల్లీ విమానమెక్కిన మన ఒలింపిక్ విజేతల బృందం సోమవారం సగర్వంగా సొంతగడ్డపై అడుగుపెట్టింది. భారత కీర్తిని ఇనుమడింపజేసిన వీరులు వస్తున్నారని తెలియగానే క్రీడాభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి చేరుకొని సందడి చేశారు. పూలదండలు, మంగళహారతులు, డప్పు చప్పుళ్లతో నయా హీరోలకు ఘన స్వాగతం పలికారు. దారి పొడుగునా భారత్ మాతాకి జై, జయహో భారత్ నినాదాలు హోరెత్తాయి!
న్యూఢిల్లీ: విశ్వక్రీడల్లో మువ్వన్నెల జెండాను రెపరెపలాడించి స్వదేశంలో అడుగుపెట్టిన భారత అథ్లెట్లకు ఘన స్వాగతం లభించింది. సోమవారం ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న క్రీడాకారులకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్) డైరెక్టర్ సందీప్ ప్రధాన్ ఆటగాళ్లకు స్వాగతం పలికారు. అథ్లెటిక్స్లో భారత్కు తొలి స్వర్ణాన్ని అందించిన నీరజ్ చోప్రా దర్శనమివ్వగానే అభిమానులు ఎగబడ్డారు. నీరజ్తో పాటు రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియా, కాంస్యం సాధించిన బజరంగ్ పునియా, బాక్సర్ లవ్లీనా బొర్గోహై, పురుషుల, మహిళల హాకీ జట్లు విమానాశ్రయానికి చేరుకోగానే.. పూలమాలలు, డప్పు దరువులు, మంగళ హారతులు, రంగు హంగులతో పండుగ వాతావరణం నెలకొంది. అక్కడి నుంచి అథ్లెట్లంతా అశోక హోటల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అథ్లెట్లను ఘనంగా సన్మానించారు. ‘భారత బృందంలోని చాలా మంది ఆటగాళ్లు టోక్యోలో జరిగిన ఒలింపిక్స్లో తొలిసారి పాల్గొన్నవారే. ఈ పోటీలలో దేశం సాధించిన విజయం న్యూ ఇండియా ఆశలను ప్రతిబింబింపజేస్తున్నది. టీమ్ ఇండియా అద్భుతంగా రాణించింది. దేశాన్ని ఒక్కతాటిపైకి తెచ్చే శక్తి క్రీడలకు ఉంది. ఈ పోటీలలో భారత ప్రయాణం అద్భుతంగా సాగింది’ అని అన్నారు. వచ్చే ఒలింపిక్స్లో భారత్కు మరిన్ని పతకాలు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
గొప్ప అనుభూతి..
అథ్లెటిక్స్లో ఒలింపిక్ స్వర్ణం నెగ్గాలనే భారత కలను నెరవేర్చిన నీరజ్ చోప్రా మాట్లాడుతూ.. ‘మేమంతా మధ్య తరగతి నుంచి వచ్చిన వాళ్లమే. నాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఈ పతకం దేశానిది. నా బయోపిక్లో అక్షయ్కుమార్ నటిస్తే ఆనందిస్తా’ అని అన్నాడు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత్కు హాకీలో పతకం తెచ్చిన కెప్టెన్ మన్ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ‘ఇది చాలా గొప్ప అనుభూతి. మాకు మద్దతునిచ్చిన ప్రభుత్వానికి, సాయ్కు, భారత ఒలింపిక్ సంఘానికి కృతజ్ఞతలు’ అని అన్నాడు. బాక్సర్ లవ్లీనా స్పందిస్తూ.. ‘స్వదేశానికి తిరిగివచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మాపై దేశ ప్రజలు చూపించిన ప్రేమకు ఫిదా అయిపోయాం. భవిష్యత్తులో ఇలాంటి పతకాలు మరిన్ని సాధించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తా’ అని చెప్పింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ క్రీడా మంత్రి, ప్రస్తుతం న్యాయశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న కిరణ్ రిజిజు, నిశిత్, తదితరులు పాల్గొన్నారు. పీవీ సింధు, మీరాబాయి చానులు వారి స్వస్థలాల్లో ఉండటంతో ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.