Ashes Series : లార్డ్స్ వేదికగా జరుగుతున్న యాషెస్(Ashes) రెండో టెస్టులో ఆస్ట్రేలియా పట్టు బిగించేలా కనిపిస్తోంది. ముగ్గురు అర్ధ సెంచరీలు బాదడంతో తొలి రోజు 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు కొట్టింది. ఇంగ్లండ్ బౌలర్లు త్వరత్వరగా వికెట్లు తీయడంలో విఫలమవడాన్ని మాజీలు తప్పుపడుతున్నారు. తాజాగా.. మొదటి రోజు మ్యాచ్ను తేలికగా తీసుకున్న ఇంగ్లండ్ ఆటగాళ్లపై మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్(Kevin Pietersen) ఘాటు విమర్శలు చేశాడు. ఇది యాషెస్ మ్యాచ్.. ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదని, రెండో రోజు దూకుడుగా ఆడాలని సూచించాడు. పీటర్సన్ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
‘ఇంగ్లండ్ మీ అసలైన ఆట చూపించండి. ఈరోజు ఆసీస్కు అవకాశం ఇవ్వకూడదు. మైదానంలో కామ్గా ఉండడం సరికాదు. ఆ మిగతా ఐదు వికెట్లు కూడా తీసి పర్యాటకు జట్టును ఆలౌట్ చేయండి. ఆ తర్వాత బ్యాటింగ్లో రాణించండి. ఎందుకంటే..? ఇది యాషెస్ సిరీస్ మ్యాచ్. ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదు’ అని పీటర్సన్ బెన్ స్టోక్స్ బృందాన్ని గట్టిగానే మందలించాడు.
Come on, @englandcricket !
Stand tall today and take it to the Australians. Stop being so nice and get some mongrel in you! Take those 5 wickets quick and bat well!
This is The Ashes and not an exhibition game! 👊🏽— Kevin Pietersen🦏 (@KP24) June 29, 2023
తొలి టెస్టులో నెగ్గిన ఆస్ట్రేలియా రెండో టెస్టునూ ధాటిగా ఆరంభించింది. 5 వికెట్ల నష్టానికి 339 పరుగులు కొట్టింది. గత మ్యాచ్ సెంచరీ హీరో ఉస్మాన్ ఖవాజా(17) తక్కువకే వెనుదిరిగినా.. మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్(66) అర్ధ శతకంతో మెరిశాడు. ఆ తర్వాత మార్నస్ లబూషేన్(47), ట్రావిస్ హెడ్(77) ధనాధన్ ఆడి ఇన్నింగ్స్ నిర్మించారు.
స్టీవ్స్మిత్ – బెన్ స్టోక్స్
హెడ్ ఔటయ్యాక స్టీవ్స్మిత్(85 నాటౌట్), అలెక్స్ క్యారీ(11 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మోయిన్ అలీ స్థానంలో రెండో టెస్టు ఆడుతున్న జోష్ టంగ్ రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. జో రూట్ ఆఖరి సెషన్లో వరుస బంతుల్లో హెడ్, కామెరూన్ గ్రీన్ను ఔట్ చేశాడు. దాంతో, ఇంగ్లండ్ ఊపిరి పీల్చుకుంది. అయితే.. స్మిత్ ఇంకా క్రీజులో ఉండడంతో ఆసీస్ ధీమాగా కనిపిస్తోంది.