హైదరాబాద్: ఐపీఎల్ అంటేనే పవర్ హిట్టింగ్. భారీ షాట్లతో అలరించే బ్యాటర్లదే పైచేయి ఉంటుంది. ఈసారి ఐపీఎల్(IPL 2023)లో చాలా మంది క్రికెటర్లు తమ ఆట తీరును ఆకట్టుకున్నారు. 10 జట్లు పోటీపడ్డ ఈ టోర్నీలో.. కొందరు బ్యాటర్లు సెంచరీలతో అలరించారు. అయితే మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ .. ఐపీఎల్లో టాప్ 5 బ్యాటర్ల జాబితాను ప్రకటించాడు. ఈ సారి టోర్నీలో సెంచరీలు కొట్టిన యశస్వి జైస్వాల్, ప్రభుసిమ్రన్ సింగ్లు సెహ్వాగ్ జాబితాలో ఎంపికయ్యారు. ముంబైతో గుజరాత్ ఆడటానికి ముందు సెహ్వాగ్ తన మేటి బ్యాటర్ల లిస్టును ప్రకటించారు. సెహ్వాగ్ తన టాప్ లిస్టులో గిల్, కోహ్లీని ఎంపిక చేయలేదు.
తాను ఎంపిక చేసిన అయిదుగురు పాండవుల్లో .. రింకూ సింగ్ తొలి స్థానంలో ఉంటాడని సెహ్వాగ్ తెలిపాడు. కేకేఆర్ బ్యాటర్ రింకూ ఈ టోర్నీలో ఎలా ఆడాడో అందరికీ తెలిసిందే. వరుసగా అయిదు సిక్స్లు కొట్టి ఏ బ్యాటర్ కూడా జట్టును గెలిపించలేదని, కానీ రింకూ సింగ్ ఒక్కడే ఆ ట్యాలెంట్ చూపించినట్లు సెహ్వాగ్ మెచ్చుకున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో చెన్నై ప్లేయర్ శివమ్ దూబే కూడా తన ఆట తీరుతో థ్రిల్ చేశాడు. ఈ టోర్నీలో శివమ్ దూబే మొత్తం 33 సిక్స్లు కొట్టాడని, అతని స్ట్రయిక్ రేటు 160 ఉన్నట్లు చెప్పాడు.
సెహ్వాగ్ లిస్టులో మూడవ స్థానంలో ఓపెనర్ యశస్వి జైసాల్ ఉన్నాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో అతను ఫామ్లో లేకున్నా.. ఐపీఎల్లో మాత్రం అతను కీలక ఇన్నింగ్స్ ఆడినట్లు తెలిపాడు. ఇక మిడిల్ ఆర్డర్లో సన్రైజర్స్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ ఆటతీరు బాగుందని సెహ్వాగ్ చెప్పాడు. స్పిన్, పేస్ బౌలింగ్ను అతను ఎదుర్కొన్న తీరు అద్భుతమని కొనియాడాడు.