హైదరాబాద్, ఆట ప్రతినిధి: సుప్రీం కోర్టు నియమించిన సూపర్వైజరీ కమిటీ పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకెళుతున్నది. ముఖ్యంగా గ్రామీ ణ ప్రాంతాల్లో ప్రతిభ కల్గిన యువ క్రికెటర్లను వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా కమిటీ వైస్ చైర్మన్, ఏసీబీ డీజీ అంజినీ కుమార్ నేతృత్వంలో గురువారం మాజీ క్రికెటర్లు వెంకటపతిరాజు, వంకా ప్రతాప్ జింఖానా మైదానాన్ని పరిశీలించారు.
రాష్ట్రంలోని క్రికెటర్ల కోసం త్వరలోనే కోచింగ్ మొదలుపెడుతామని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన క్యాలెండర్ను క్రికెట్ అకాడమీ డైరెక్టర్ ప్రతాప్ విడుదల చేస్తారని తెలిపారు. నగరాలు, పట్టణాల వరకే పరిమితం గాకుండా గ్రామీణ ప్రాంత క్రికెటర్లను భాగం చేసేలా షెడ్యూల్ ఉంటుందని అంజనీ కుమార్ వివరించారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ సలహాలు, సూచనలు స్వీకరిస్తూ ముందుకు సాగుతామని ఆయన అన్నారు. ఈ నెల 15న సూపర్వైజరీ కమిటీ మరోమారు సమావేశం అవుతుందని అంజనీ కుమార్ తెలిపారు.