ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఉత్కంఠ మ్యాచ్ల పర్వం కొనసాగుతున్నది. రింకూసింగ్ సిక్స్లతో మొదలైన ఐపీఎల్ ధమాకా, నికోలస్ పూరన్ ధనాధన్ అర్ధసెంచరీకి కొనసాగింపుగా రాజస్థాన్, చెన్నై పోరు నరాలు తెగే రీతిలో సాగింది. ఆఖరి బంతి వరకు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతూ నువ్వానేనా అన్నట్లు అలరించింది. కొట్టినపిండిలాంటి చిదంబరం స్టేడియంలో చెన్నై ఆధిపత్యానికి సమిష్టి ప్రదర్శనతో రాయల్స్ గండికొట్టింది. బట్లర్ అర్ధసెంచరీతో పోరాడే స్కోరు అందుకున్న రాజస్థాన్..అశ్విన్, చాహల్, జంపా స్పిన్ త్రయంతో చెన్నై బ్యాటర్ల దూకుడుకు ముకుతాడు వేసింది. లక్ష్యఛేదనలో ధోనీ, జడేజా తుదికంటా పోరాడినా లాభం లేకపోయింది.
చెన్నై: ఐపీఎల్ రసవత్తరంగా సాగుతున్నది. పోరాడితే పోయేది ఏం లేదన్నట్లు జట్లన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. లీగ్ సాగుతున్నా కొద్ది ప్రతీ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఎలాంటి అవకాశాలను చేజార్చుకోవడం లేదు. బుధవారం ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా హోరాహోరీగా సాగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై అద్భుత విజయం సాధించింది. తమ ఇలాఖాలో రాయల్స్పై ఆధిపత్యాన్ని కొనసాగిద్దామనుకున్న చెన్నైకి భంగపాటు ఎదురైంది. తొలుత జోస్ బట్లర్(52) అర్ధసెంచరీకి తోడు అశ్విన్(30), హెట్మైర్(30 నాటౌట్) రాణించడంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 175/8 స్కోరు చేసింది. ఆకాశ్సింగ్, తుషార్ దేశ్పాండే, జడేజా రెండేసి వికెట్లు తీశారు. ఆ తర్వాత లక్ష్యఛేదనకు దిగిన చెన్నై 172/6 స్కోరుకు పరిమితమైంది. ఓపెనర్ కాన్వె(50) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, ఆఖర్లో ధోనీ(17 బంతుల్లో 32 నాటౌట్, ఫోర్, 3 సిక్స్లు), జడేజా(15 బంతుల్లో 25 నాటౌట్, ఫోర్, 2 సిక్స్లు) తుదికంటా పోరాడారు. అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా, ఆఖరి ఓవర్లో సందీప్శర్మ(1/30) అద్భుతం చేశాడు. ఆల్రౌండ్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించిన లోకల్ హీరో అశ్విన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
ఎన్నో మ్యాచ్లను తన అద్భుత బ్యాటింగ్తో ప్రత్యర్థుల నుంచి లాక్కున్న దిగ్గజ బ్యాటర్ మహేంద్రసింగ్ ధోనీకి చుక్కెదురైంది. రాజస్థాన్ నిర్దేశించిన లక్ష్యఛేదనలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్(8) వికెట్ కోల్పోయిన చెన్నైని కాన్వె ఆదుకున్నాడు. రాయల్స్ బౌలింగ్ను సమర్థంగా ఎదుర్కొంటూ రహానే(31)తో కలిసి కొనసాగించాడు. రహానే ఒక రకంగా దూకుడు కనబర్చగా, కాన్వె సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి బ్యాటింగ్తో ఒకానొక దశలో మెరుగ్గా కనిపించిన కింగ్స్ను స్పిన్నర్లు అశ్విన్,చాహల్, జంపా కట్టడి చేశారు. ఈ త్రయం ధాటికి చెన్నై వరుస విరామల్లో వికెట్లు కోల్పోయింది. ఆఖరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరమైన దశలో ధోనీ రెండు భారీ సిక్స్లతో గెలుపుపై ఆశలు రేపినా..సందీప్శర్మ పదునైన యార్కర్లతో రాయల్స్కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
200 రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్లో చెన్నై సూపర్కింగ్స్ తరఫున 200 మ్యాచ్ల్లో మహేంద్రసింగ్ ధోనీ కెప్టెన్గా వ్యవహరించాడు.
రాజస్థాన్: 20 ఓవర్లలో 175/8(బట్లర్ 52, హెట్మైర్ 30 నాటౌట్, జడేజా 2/21, దేశ్పాండే 2/37), చెన్నై: 20 ఓవర్లలో 172/6(కాన్వె 50, ధోనీ 32 నాటౌట్, అశ్విన్ 2/25, చాహల్ 2/27)