బెంగళూరు: ముంబై, మధ్యప్రదేశ్ మధ్య రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్నది. రికార్డు స్థాయిలో ఇప్పటికే 41 సార్లు టైటిల్ విజేతగా నిలిచిన ముంబై ఓవైపు..మరోవైపు సుదీర్ఘ విరామం తర్వాత తుదిపోరులో నిలిచిన మధ్యప్రదేశ్ నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నాయి. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగుతున్న మ్యాచ్లో ముంబై స్టార్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పరుగుల వరద పారించాడు. రంజీల్లో తన సూపర్ఫామ్ను దిగ్విజయంగా కొనసాగిస్తూ మరో సూపర్ సెంచరీతో కదంతొక్కడంతో ముంబై తొలి ఇన్నింగ్స్లో 374 స్కోరు చేసింది.
మధ్యప్రదేశ్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ చెలరేగిన సర్ఫరాజ్ ఈ సీజన్లో నాలుగో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. గౌరవ్ యాదవ్(4/106)కు నాలుగు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్కు ఎంపీ..ముంబైకి దీటుగా సమాధానమిస్తున్నది. యశ్దూబే(44 నాటౌట్), శుభమ్శర్మ(41 నాటౌట్) క్రీజులో ఉన్నారు. హిమంశు(31) వికెట్ కోల్పోయిన మధ్యప్రదేశ్ రెండో రోజు ఆట ముగిసే సరికి 123 పరుగులు చేసింది. చేతిలో తొమ్మిది వికెట్లు ఉన్న ఎంపీ ప్రస్తుతం ముంబై స్కోరుకు 251 పరుగుల దూరంలో ఉంది. తుషార్ దేశ్పాండే(1/31)కు ఒక వికెట్ దక్కింది.
సర్ఫరాజ్ సెంచరీ మానియా: ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ సెంచరీల మానియా దిగ్విజయంగా కొనసాగుతున్నది. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయకుండా ముంబై తరఫున ఈ యువ క్రికెటర్ పరుగుల వరద పారిస్తున్నాడు. వేదిక ఏదైనా బౌలర్లను చీల్చిచెండాటమే లక్ష్యంగా దూసుకెళుతున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఆడిన ఆరు మ్యాచ్ల్లో నాలుగు సెంచరీలతో 937 పరుగులతో కొనసాగుతున్నాడు. ముంబై మరోమారు బ్యాటింగ్కు దిగితే..ఖాన్ కచ్చితంగా వెయ్యి పరుగుల మార్క్ చేరుకునే అవకాశం ఉంది. గత సీజన్లోనూ సర్ఫరాజ్ 928 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
ఓవర్నైట్ స్కోరు 248/5తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబైని సర్ఫరాజ్ ముందుండి నడిపించాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షమ్స్ ములానీ(12)..గౌరవ్ యాదవ్ బౌలింగ్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆ తర్వాత వచ్చిన లోయార్డర్ బ్యాటర్లతో ఖాన్ ఇన్నింగ్స్ కొనసాగించాడు. ఓవైపు మంచి బంతులను గౌరవిస్తూనే..చెత్త బంతులకు బౌండరీ దారి చూపించాడు.
ఈ క్రమంలో మైదానం నలువైపులా ట్రేడ్మార్క్ షాట్లతో అలరించాడు. గత సీజన్లకు భిన్నంగా తనలో కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ సర్ఫరాజ్ ఆడిన ఆటకు అందరూ ఫిదా అయ్యారు. ఈ క్రమంలో డాషింగ్ బ్యాటర్ను ఔట్ చేసేందుకు మధ్యప్రదేశ్ కెప్టెన్ ఆదిత్య శ్రీవాత్సవ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. 97 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తనదైన శైలిలో కీపర్ తలపై నుంచి బౌండరీ బాది సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. సెంచరీ మార్క్ చేరుకోగానే బెబ్బులిలా గర్జిస్తూ ఉబికి వస్తున్న కన్నీటితో సంబురాలు చేసుకున్నాడు. ధవన్ ైస్టెల్లో తొడగొట్టి తన నైజం ఏంటో చెప్పకనే చెప్పాడు. ఖాన్ అందించిన భారీ స్కోరుకు తగ్గట్లు ముంబై బౌలర్లు చెలరేగితే మధ్యప్రదేశ్కు కట్టడి చేయవచ్చు.
ముంబై తొలి ఇన్నింగ్స్: 374 ఆలౌట్ (సర్ఫరాజ్ ఖాన్ 134, యశస్వి జైస్వాల్ 78, గౌరవ్ యాదవ్ 4/106, అనుభవ్ అగర్వాల్ 3/81), మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్: 123/1 (యశ్ దూబే 44 నాటౌట్, శుభ్మన్ శర్మ 41 నాటౌట్, తుషార్ దేశ్పాండే 1/31)