భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన స్టార్ ఆటగాళ్లు ఒక్కొక్కరు నిష్క్రమిస్తున్న వేళ.. డబుల్స్ జోడీ అద్వితీయ ప్రదర్శన నమోదు చేసింది. ఇండోనేషియా ఓపెన్లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట ఫైనల్కు దూసుకెళ్లింది. ఈ జోడీకి ఇదే తొలి ప్రపంచ టూర్ సూపర్-1000 ఫైనల్ కాగా.. పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో హెచ్ఎస్ ప్రణయ్ పోరాడి ఓడాడు.
జకార్తా: భారత స్టార్ జోడీ సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించారు. ఇటీవలి కాలంలో నిలకడగా రాణిస్తున్న ఈ జంట తొలిసారి వరల్డ్ టూర్ సూపర్-1000 టోర్నీ ఫైనల్కు అర్హత సాధించింది. ఇండోనేషియా ఓపెన్ పురుషుల డబుల్స్లో ఏడో సీడ్ సాత్విక్-చిరాగ్ ద్వయం 17-21, 21-19, 21-18తో మిన్ హ్యూక్ కాంగ్-సెంగ్ జో (కొరియా) జోడీపై విజయం సాధించింది. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన భారత జంట.. తొలి గేమ్లో ఓడినా.. ఆ తర్వాత తిరిగి పుంజుకుని వరుస గేమ్ల్లో సత్తాచాటింది. మరోవైపు సింగిల్స్లో ఆశలు రేపిన హెచ్ఎస్ ప్రణయ్ సెమీస్లో ఓటమి పాలయ్యాడు. శనివారం పురుషుల సింగిల్స్ సెమీస్లో ప్రణయ్ 15-21, 15-21తో టాప్ సీడ్ విక్టర్ అక్సెల్సెన్ (డెన్మార్క్) చేతిలో ఓటమి పాలయ్యాడు. మ్యాచ్ ఆరంభం నుంచి పూర్తి ఆధిపత్యం కనబర్చిన విక్టర్.. భారత షట్లర్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయాడు. క్రాస్ కోర్ట్ షాట్లతో పాటు.. నెట్ దగ్గర తెలివైన డ్రాప్లతో పాయింట్లు కొల్లగొట్టాడు. విక్టర్ చేతిలో ప్రణయ్కు ఇది ఆరో పరాజయం.
సెమీస్లో పోరాడి గెలువడం సంతోషాన్నిచ్చింది. తొలి గేమ్ కోల్పోయాక కాస్త ఒత్తిడిలో పడ్డా.. లయ అందుకున్నాక అదే జోరు కొనసాగించాం. మూడో గేమ్లో ప్రత్యర్థి పుంజుకోవడంతో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయినా పట్టుదలతో శ్రమించి కొరియా ప్లేయర్ల డిఫెన్స్ను ఛేదించగలిగాం. ఫైనల్ గురించి ఎక్కువ ఆలోచించడం లేదు.
-సాత్విక్ సాయిరాజ్
గత కొంత కాలం నుంచి బీడబ్ల్యూఎఫ్ సర్క్యూట్లో నిలకడ కొనసాగిస్తున్న సాత్విక్ జోడీ.. సెమీస్ తొలి గేమ్లో పరాజయం పాలైంది. రెండో గేమ్లో శక్తినంతా కూడదీసుకొని విజృంభించిన భారత షట్లర్లు ఆది నుంచి పైచేయి కొనసాగించారు. 6-3తో లీడ్ సాధించిన మనవాళ్లు.. బ్రేక్ సమయానికి 11-4తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచారు. బాడీ స్మాష్లు, ఫాస్ట్ ఫేస్డ్ షాట్లతో చెలరేగారు. అయితే ఆ తర్వాత కోలుకున్న కొరియా షట్లర్లు 15-18తో భారత ఆటగాళ్లకు చేరువైనా.. సాత్విక్-చిరాగ్ జోడీ పట్టు వదలకుండా గేమ్ ముగించింది. ఇక నిర్ణయాత్మక మూడో పోరులో వరుసగా ఏడు పాయింట్లు సాధించిన భారత్ 12-5తో లీడ్ సాధించింది. పోరాట పటిమ కనబర్చిన కొరియా ప్లేయర్లు ఒక దశలో స్కోరు 16-16తో సమం చేశారు. దీంతో విజయం ఇరువురి మధ్య దోబూచులాడింది. ప్రతి పాయింట్ కోసం సుదీర్ఘ షాట్ల ర్యాలీ సాగగా.. కీలక దశలో ఆధిక్యం కనబర్చిన భారత జోడీ మ్యాచ్ను సొంతం చేసుకుంది. గంటకు పైగా సాగిన పోరులో చిరాగ్ నెట్ గేమ్తో ఆకట్టుకుంటే.. సాత్విక్ పదునైన స్మాష్లతో విజృంభించాడు. ఆదివారం జరుగనున్న తుది సమరంలో రెండో సీడ్ అరోన్ చియా-వుయి యిక్ సో (మలేషియా)తో భారత షట్లర్లు తలపడనున్నారు.
భారత బ్యాడ్మింటన్ అంటే.. సైనా నెహ్వాల్, పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్ ఇలా సింగిల్స్ ప్లేయర్ల పేర్లే ఎక్కువ చర్చకు వచ్చేవి. కానీ ఇటీవలి కాలంలో డబుల్స్లోనూ మనవాళ్లు దుమ్మురేపుతున్నారు. ముఖ్యంగా ఆంధ్ర కుర్రాడు సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి అంతర్జాతీయ సర్క్యూట్లో నిలకడైన విజయాలతో డబుల్స్లోనూ మనం పతకాలు కొల్లగొట్టగలమనే భరోసా ఇస్తున్నారు. నిరుడు బర్మింగ్హామ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణం నెగ్గిన ఈ జోడీ.. ఇప్పుడు ఇండోనేషియా ఓపెన్ తుదిపోరుకు అర్హత సాధించింది. తద్వారా తొలిసారి సూపర్ సిరీస్-1000 టోర్నీ ఫైనల్ ఆడనుంది. గతంలోనూ మనవాళ్లు డబుల్స్లో విజయాలు సాధించినా.. అవి అడపాదడపా మాత్రమే నమోదయ్యేయి. ఈ జంట మాత్రం గత రెండు మూడేండ్లుగా బరిలోకి దిగిన ప్రతి టోర్నీలోనూ సత్తాచాటుతున్నది. ప్రస్తుతం ప్రపంచ ఆరో ర్యాంక్లో కొనసాగుతున్న ఈ జోడీ.. ఇదే జోరు కొనసాగిస్తే.. ఆసియా గేమ్స్, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక క్రీడల డబుల్స్లోనూ మనం పతకాలు ఆశించవచ్చు.