దుబాయ్: బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా.. నిబంధనలను అతిక్రమించిన భారత మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్పై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) కఠిన చర్యలు తీసుకుంది. వికెట్లను బ్యాట్తో కొట్టడంతో పాటు.. అంపైర్ నిర్ణయంపై బాహాటంగా అసంతృప్తి వ్యక్తం చేసినందుకు గానూ.. హర్మన్పై రెండు మ్యాచ్ల నిషేధం పడింది. మూడో వన్డేలో టీమ్ఇండియా చేజింగ్ చేస్తున్న సమయంలో అంపైర్ హర్మన్ను ఔట్గా ప్రకటించాడు. దీంతో ఆగ్రహానికి గురైన హర్మన్ తన బ్యాట్తో వికెట్లను కొట్టడంతో పాటు.. నిర్ణయాన్ని వ్యతిరేకించింది. దీంతో ఆమె మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించడంతో పాటు 4 డీ మెరిట్ పాయింట్లు కేటాయించారు. ఫలితంగా భారత్ ఆడనున్న తదుపరి రెండు మ్యాచ్లకు హర్మన్ప్రీత్ దూరం కానుంది. టీమ్ఇండియా తదుపరి సిరీస్ ఆసియా క్రీడలే కాగా.. అందులో తొలి రెండు మ్యాచ్లకు హర్మన్ అందుబాటులో లేకుండా పోయింది. ‘క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వికెట్లను కొట్టినందుకు గానూ లెవల్-2 తప్పిదం కింద హర్మన్ మ్యాచ్ ఫీజులో 50 శాతం తో పాటు 3 డీ మెరిట్ పాయింట్లు.. అంపైర్ నిర్ణయాన్ని తప్పుపట్టినందుకు జరిమానాతో పాటు బోర్డు ఒక డీ మెరిట్ పాయింట్ విధించింది.