బెంగళూరు : మూడు ఓవర్లలో 37 పరుగులు సమర్పించుకున్న బౌలర్కు చివరి ఓవర్లో బంతి అందించి పది పరుగులు ఇవ్వకుండా చేయాలంటే అతని మదిలో ఎలాంటి సంఘర్షణ చోటు చేసుకుంటుందో అర్ష్దీప్ సింగ్ ఆదివారం అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు. ఆస్ట్రేలియాతో ఐదో టి20 మ్యాచ్లో గెలుపు కోసం పది పరుగులు చేయాల్సిన తరుణంలో జోరుమీదున్న వేడ్ బంతిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడు.
తొలి బంతిని అర్ష్దీప్ బౌన్సర్గా వేశాడు. దానిని వైడ్గా ప్రకటిస్తారనుకున్న వేడ్ ఆశలు నెరవేరలేదు. రెండో బంతి యార్కర్గా దూసుకొచ్చింది. తొలి రెండు బంతులకు పరుగులు రాబట్టడంలో వేడ్ విఫలమయ్యాడు. ఫుల్లెంగ్త్లో వచ్చిన మూడో బంతిన వేడ్ సిక్సర్గా మలిచేందుకు ప్రయత్నించి లాంగాన్లో శ్రేయాస్ అయ్యర్కు దొరికిపోయాడు. ఈ వికెట్తో తనలో గెలుపుపై నమ్మకం ఏర్పడిందని అర్ష్దీప్ మ్యాచ్ అనంతరం తెలిపాడు. తరువాతి మూడు బంతులకు సింగిల్స్ రావడంతో ఇండియా ఆరు పరుగులతో గెలుపొందింది. తనకు నచ్చిన విధంగా బౌలింగ్ చేసేందుకు కెప్టెన్ సహకరించాడని, అదే తనలో విశ్వాసం కలిగించిందని సింగ్ అన్నాడు.