న్యూఢిల్లీ: ప్రపంచ మాజీ నెంబర్ వన్ టెన్నిస్ తార అష్లీ బార్టీ (26) తల్లి కాబోతుంది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ప్రకటించింది. ఈ మేరకు తన ఇన్స్టా హ్యాండిల్లో ఒక ఫొటోను పోస్టు చేసింది. ఆ ఫొటోలు తన పెంపుడు కుక్క ఒరిగి, దాని పక్కన చిన్న పిల్లల చెప్పుల జోడు ఉన్నాయి. ఆ ఫొటో కింద ‘2023 నా జీవితంలో ఉత్తమ ఏడాది కానుంది (2023 సెట్ టు బి ద బెస్ట్ ఇయర్ ఎట్)’ అని రాసుకుంది.
అంతేగాక, తమ ఇంట్లోకి రాబోయే కొత్త మనిషి కోసం తాము ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నామని, అక్కలా తనను (పుట్టబోయే బిడ్డను) కాపాడుకోవడానికి ఒరిగి (పెంపుడు కుక్క) సిద్ధంగా ఉందని అష్లీ బార్టీ తన ఇన్స్టా పోస్టులో రాసింది. కాగా, అష్లీ బార్టీ 2017 నుంచి గోల్ఫ్ ప్లేయర్ గ్యారీ కిస్సిక్తో సహజీవనం చేసింది. 2021లో వారి ఎంగేజ్మెంట్ జరిగింది. 2022 జూలైలో ఇద్దరూ పెండ్లి చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో త్వరలో తాను తల్లిని కాబోతున్నానని బార్టీ సంతోషంగా ప్రకటించింది. తన తొలుసూరి బిడ్డకు జన్మినివ్వడం కోసం ఆమె ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు పేర్కొంది. కాగా, మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ గెలిచిన అష్లీ బార్టీ 2022 మార్చిలో తన 25వ ఏటనే టెన్నిస్కు వీడ్కోలు పలికింది. బార్టీ గెలిచిన గ్రాండ్స్లామ్ టైటిల్స్లో ఫ్రెంచ్ ఓపెన్ (2019), వింబుల్డన్ (2021), ఆస్ట్రేలియన్ ఓపెన్ (2022) ఉన్నాయి.
కెరీర్ మొత్తంలో 27 టైటిల్స్ (15 సింగిల్స్, 12 డబుల్స్) నెగ్గిన బార్టీ ప్రైజ్ మనీగా సుమారు 24 మిలియన్ డాలర్లు (సుమారుగా రూ.205 కోట్లు) సంపాదించింది. అదేవిధంగా బార్టీ వరుసగా 114 వారాలపాటు వరల్డ్ నెంబర్గా ఉన్నది. మహిళా టెన్నిస్ చరిత్రలో అంత సుదీర్ఘకాలం నెంబర్ వన్గా ఉన్న నాలుగో మహిళగా బార్టీ రికార్డు నెలకొల్పింది. స్టెఫీ గ్రాఫ్ (186 వారాలు), సెరెనా విలియమ్స్ (186 వారాలు), మార్టినా నవ్రతిలోవా (156) బార్టీ కంటే ముందు ఉన్నారు.