హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ యువ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ అంతర్జాతీయ వేదికపై మరోమారు మెరిశాడు. స్పెయిన్ వేదికగా జరిగిన చెస్సెబుల్ సన్వే సిట్జెస్ ఇంటర్నేషనల్ బ్లిట్జ్ చెస్ చాంపియన్షిప్లో రిత్విక్ టైటిల్ విజేతగా నిలిచాడు. మొత్తం తొమ్మిది రౌండ్ల పాటు జరిగిన టోర్నీలో రిత్విక్ 8.5 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకున్నాడు. మొత్తం 30 దేశాల నుంచి 120 మంది ప్లేయర్లు పోటీపడ్డ టోర్నీలో ఈ హైదరాబాదీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. టోర్నీలో అపజయమెరుగని రిత్విక్ ఎనిమిది విజయాలు, ఒక డ్రా ఖాతాలో వేసుకున్నాడు. భవిష్యత్లో మరిన్ని విజయాలతో దేశానికి మరింత ఖ్యాతి తీసుకొస్తానని ధీమా వ్యక్తం చేశాడు.