న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక మహిళల బాక్సింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో భారత బాక్సర్లు నిఖత్ జరీన్, నీతూ గంగాస్, లవ్లీనా బొర్గోహై, సవీటీ బూర పసిడి పతకమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. శని, ఆదివారాల్లో జరిగే పసిడి పతక పోరులో ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు పట్టుదలతో ఉన్నారు. ముఖ్యంగా కెరీర్లో సూపర్ ఫామ్మీదున్న తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ అరుదైన రికార్డుకు మరో అడుగు దూరంలో ఉంది.
ఆదివారం ఫైనల్ పోరులో వియత్నాంకు చెందిన న్యుయిన్ థీ తమ్తో నిఖత్ అమీతుమీ తేల్చుకోనుంది. టెక్నికల్గా మెరుగైన బాక్సర్గా పేరొందిన వియత్నాం బాక్సర్ను ఎదుర్కొనేందుకు నిఖత్ సర్వశక్తులు ఎదురొడ్డే అవకాశముంది. ఆదివారం పసిడి పతక పోరులో నిఖత్ గెలిస్తే ఒకటి కంటే ఎక్కువ సార్లు స్వర్ణం గెలిచిన దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ సరసన నిలువనుంది. మెగాటోర్నీలో ఇప్పటికే రెండుసార్లు కాంస్య పతకం సాధించిన లవ్లీనా స్వర్ణంపై కన్నేసింది. ప్రత్యర్థులపై పంచ్లతో విరుచుకుపడుతున్న నీతూ, సీనియర్ సవీటీ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు.