ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ దుమ్మురేపుతున్నాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచేస్తూ మెగాటోర్నీలో పతకం పక్కా చేసుకున్నాడు. బుధవారం హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో బల్గేరియా బాక్సర్ను చిత్తు చేస్తూ సెమీస్లోకి దూసుకెళ్లాడు. తన పంచ్ పవర్తో చెలరేగుతూ చిరస్మరణీయ విజయాన్ని ఖాతాలో వేసుకుని కనీసం కాంస్య పతకాన్ని ఖరారు చేసుకున్నాడు. హుసామ్కు తోడు దీపక్ బోరియా, నిశాంత్దేవ్.. సెమీస్లోకి ప్రవేశించి భారత్కు తిరుగులేదని నిరూపించారు.
తాష్కెంట్: ప్రపంచ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. ఆసియా, ఒలింపిక్స్ ముందు జరుగుతున్న ఈ మెగాటోర్నీలో మన బాక్సర్లు పతకాలే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. బుధవారం జరిగిన వేర్వేరు కార్వర్ట్స్ బౌట్లలో మహమ్మద్ హుసాముద్దీన్(57కి), దీపక్ భోరియా(51కి), నిశాంత్దేవ్(71కి) అద్భుత విజయాలు సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. దీని ద్వారా మెగాటోర్నీలో భారత్కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయం చేశారు. గత(2019) టోర్నీలో అమిత్ పంగల్(రజతం), మనీశ్ కౌశిక్(కాంస్యం) భారత్కు రెండు పతకాలు అందించారు.
హుసామ్ భళా : బాక్సింగ్ చాంపియన్షిప్లో ఎలాగైనా సత్తాచాటాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన హుసామ్..అందుకు తగ్గట్లు అద్భుత ప్రతిభ చాటుతున్నాడు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. బుధవారం ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన క్వార్టర్స్ పోరులో హుసామ్ 4-3తో డియాజ్ ఇబనెజ్(బల్గేరియా)పై చిరస్మరణీయ విజయం సాధించాడు. నువ్వానేనా అన్నట్లు సాగిన బౌట్లో బల్గేరియా బాక్సర్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా వెనుకకు తగ్గకుండా హుసామ్ సూపర్ పంచ్లతో సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో తొలి రౌండ్లో 3-2తో హుసామ్ ఆధిక్యం కనబరిచాడు.
రౌండ్ రౌండ్కు ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేసుకుంటూ బల్గేరియా బాక్సర్పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఓవైపు పంచ్లతో విరుచుకుపడుతూనే మరోవైపు జాబ్స్, హుక్స్తో ముప్పేట దాడికి పాల్పడ్డాడు. ప్రత్యర్థి పంచ్లను కాసుకుకూర్చుంటూ ఎదురుదాడికి దిగడం హుసామ్కు కలిసొచ్చింది. సెమీస్లో క్యూబాకు చెందిన సైడెల్ హోర్టాతో ఈ ఇందూరు బాక్సర్ తలపడుతాడు. మరోవైపు నిశాంత్ దేవ్..క్యూబా బాక్సర్ జార్జ్ క్యుల్లర్ను నాకౌట్ చేశాడు. నిశాంత్ పంచ్లకు తాళలేక జార్జ్ విలవిలలాడిపోయాడు. ఆది నుంచే విరామం లేని పంచ్లతో విరుచుకుపడ్డ నిశాంత్ తొలిసారి సెమీస్ బెర్తు దక్కించుకున్నాడు. దీపక్ 5-0 తేడాతో నూర్జుహిట్ దిశుబయేవ్(కిర్గిస్థాన్)పై అద్భుత విజయం సాధించి సెమీస్లో బెన్నెమా(ఫ్రాన్స్)తో పోరుకు సిద్ధమయ్యాడు.
క్వార్టర్స్ బౌట్ చాలా హోరాహోరీగా సాగింది. ప్రత్యర్థి రఫ్గా ఆడటంతో నాకు సమస్యలు ఎదురయ్యాయి. కానీ ఎక్కడా వెనుకంజ వేయకుండా దీటుగా బదులివ్వడం కలిసొచ్చింది. ప్రత్యర్థికి ఒక రకంగా ఎడం పాటిస్తూ పంచ్లు సంధించడం వలన కీలక పాయింట్లు ఖాతాలో వేసుకోగలిగాను.
-హుసాముద్దీన్