హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ అదిరిపోయే బోణీ కొట్టింది. సోమవారం జరిగిన బాలుర రెజ్లింగ్ అండర్-18 విభాగంలో నిఖిల్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో నిఖిల్ 8-4 తేడాతో భువనేశ్(హర్యానా)పై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు ప్రదర్శించిన ఈ యువ రెజ్లర్..ప్రత్యర్థికి ఎక్కడా అవకాశమివ్వకుండా పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలో ఓవరాల్గా ఖేలోఇండియా రెజ్లింగ్లో పతకం సాధించిన తొలి తెలంగాణ ప్లేయర్గా నిఖిల్ కొత్త రికార్డు నెలకొల్పాడు. కంచు పట్టుతో ఆకట్టుకున్న నిఖిల్ను సాట్స్ డిప్యూటీ డైరెక్టర్లు ధనలక్ష్మి, చంద్రారెడ్డి, రవీందర్, కోచ్లు నర్సింగ్రావు, గోకుల్, అశోక్కుమార్, జైపాల్ అభినందించారు.
నిశికా అగర్వాల్కు రజతం:
ఖేలోఇండియా యూత్ గేమ్స్లో తెలంగాణ యువ జిమ్నాస్ట్ నిశికా అగర్వాల్ రజత పతకంతో ఆకట్టుకుంది. సోమవారం జరిగిన బాలికల అండర్-18 అన్ఈవెన్ బార్స్ విభాగంలో నిశిక 9:14 స్కోరుతో రెండోస్థానంలో నిలిచింది. అయూశీ (ఉత్తర్ప్రదేశ్), సనికా (మహారాష్ట్ర) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.