హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటాలని రాష్ట్ర క్రీడా, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మంగళవారం పుల్లెల గోపీచంద్ సాయ్ బ్యాడ్మింటన్ అకాడమీని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘గోపీచంద్, సైనా, సింధు లాంటి ప్లేయర్లు బ్యాడ్మింటన్ క్రీడకు హైదరాబాద్ను పుట్టినిల్లుగా మార్చారు. రాష్ట్రంతో పాటు దేశానికి వారు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో మెరుగైన క్రీడా పాలసీని తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. కరోనాపై పోరాటంలో భాగంగా క్రీడాకారులకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని సాట్స్ అధికారులను మంత్రి ఆదేశించారు. కరోనా నిర్మూలనలో భాగంగా ప్రజల ప్రాణాలే ముఖ్యంగా అందరికీ ఉచితంగా వ్యాక్సినేషన్ అమలు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్ కోసం శిక్షణ పొందుతున్న సాయి ప్రణీత్, చిరాగ్శెట్టి, సాత్విక్, కోచ్ గోపీచంద్తో కలిసి మంత్రి శ్రీనివాస్గౌడ్ సరదాగా బ్యాడ్మింటన్ ఆడి ఉత్సాహపరిచారు. టోక్యో విశ్వక్రీడల్లో భారత అథ్లెట్లు అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు సాధించాలని సూచించారు.