హైదరాబాద్, ఆట ప్రతినిధి : క్రీడల స్వరూపాన్ని, భవిష్యత్తును టెక్నాలజీ పూర్తిగా మార్చేసిందని భారత స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ అన్నాడు. గత ఏడేనిమిది ఏండ్లుగా క్రీడలతో టెక్నాలజీ బంధం విపరీతంగా పెరిగిపోయిందన్నాడు. ఇది కేవలం మ్యాచ్ వ్యూహాలకే పరిమితం కాకుండా ఆటగాళ్ల ఫిట్నెస్, వెల్నెస్, రికవరీలో కూడా భాగంగా మారిందని పేర్కొన్నాడు.
సోమవారం హైదరాబాద్ లో జరిగిన ‘స్ప్రింట్ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ లాంచ్ కార్యక్రమానికి చహల్ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడాడు. క్రికెట్ను ఉదాహరణగా చూపుతూ చహల్ టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించాడు. దేశంలోనే తొలిసారిగా స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్ స్టార్టప్ల కోసం 360డీ స్పోర్ట్స్, లెగసీ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించాయని స్ప్రింట్ ఎక్స్ వ్యవస్థాపక భాగస్వామి కార్తీక్ యనమండ్ర తెలిపారు.