పెర్త్: స్టార్ ఓపెనర్ లోకేశ్ రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నా.. టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో టీమ్ఇండియా పరాజయం పాలైంది. గురువారం జరిగిన పోరులో రోహిత్ సేన 36 పరుగుల తేడాతో వెస్ట్రన్ ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. మొదట బ్యాటింగ్ చేసిన ప్రత్యర్థి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. హబ్సన్ (64), డీఆర్సీ షార్ట్ (52) రాణించారు. మన బౌలర్లలో అశ్విన్ 3, హర్షల్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 132 పరుగులకే పరిమితమైంది. రాహుల్ (55 బంతుల్లో 74; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. రిషబ్ పంత్ (9), దీపక్ హుడా (6), హార్దిక్ పాండ్యా (17), అక్షర్ పటేల్ (2), దినేశ్ కార్తీక్ (10) విఫలమయ్యారు. అందరికీ ప్రాక్టీస్ దక్కాలనే ఉద్దేశంతో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్కు దిగలేదు. వారం రోజులుగా పెర్త్లో ప్రాక్టీస్ చేస్తున్న టీమ్ఇండియా శుక్రవారం నుంచి బ్రిస్బేన్లో సాధన చేయనుంది.