న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి మరోసారి టీమ్ఇండియాను చుట్టుముట్టింది. మూడు రోజుల్లో వెస్టిండీస్తో వన్డే సిరీస్ ప్రారంభం కానుండగా.. భారత జట్టులో ముగ్గురికి కొవిడ్-19 పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అహ్మదాబాద్ వేదికగా భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం తొలి వన్డే జరుగనుండగా.. టీమ్ఇండియా ఆటగాళ్లు ఇప్పటికే ఇక్కడికి చేరుకున్నారు. మూడు రోజుల క్వారంటైన్ అనంతరం బుధవారం పరీక్షలు నిర్వహించగా.. అందులో సీనియర్ ఓపెనర్ శిఖర్ ధవన్, రిజర్వ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్, మిడిలార్డర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్కు కరోనా సోకినట్లు సమాచారం. వీరితో పాటు సపోర్ట్ స్టాఫ్లోనూ పలువురికి పాజిటివ్గా తేలినట్లు బీసీసీఐకి చెందిన ఓ అధికారి తెలిపారు. పాజిటివ్ వచ్చిన ఆటగాళ్లను వారం రోజుల పాటు ఐసొలేషన్లో ఉంచి.. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో రెండుసార్లు నెగెటివ్ వస్తేనే తిరిగి జట్టుతో కలుపనున్నారు. షారుక్ ఖాన్, సాయి కిషోర్, రిషి ధవన్.. ప్రస్తుత జట్టులో స్టాండ్బైలుగా కొనసాగుతుండగా.. వీరిని జట్టులోకి తీసుకునే అవకాశాలున్నాయి. రెగ్యులర్ కెప్టెన్గా ప్రమోషన్ పొందిన తర్వాత తొలిసారి బరిలోకి దిగనున్న రోహిత్ శర్మతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించేదెవరనేది ఆసక్తికరంగా మారింది. వన్డేల్లో రాహుల్ను ఫినిషర్గా వినియోగించుకోవాలని భావిస్తున్న మేనేజ్మెంట్ కష్టకాలంలో అతడిని మరోసారి ఓపెనింగ్కు తీసుకువస్తుందా.. లేక వెంకటేశ్ అయ్యర్ వంటి కొత్త ఆటగాళ్లతో ప్రయోగం చేస్తుందా చూడాలి!