హైదరాబాద్, ఆట ప్రతినిధి: టీమిండియా స్టార్ క్రికెటర్లు తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ తెలంగాణ టీ20 క్రికెట్ లీగ్ (టీజీ 20)లో తమ బ్యాట్, బాల్ పవర్ చూపేందుకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్రంలోని క్రికెటర్లకు ఐపీఎల్ తరహా వేదిక అందించేందుకు హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) ఈ నెల 21 నుంచి నిర్వహించే ఈ ప్రతిష్టాత్మక లీగ్ తొలి ఎడిషన్ కోసం ఆదివారం నిర్వహించిన ఆటగాళ్ల వేలంలో తిలక్ అత్యధిక రేటు పలికాడు. ఐకాన్ కేటగిరీలోని టాప్ ప్లేయర్ల కోసం 8 ఫ్రాంచైజీలు పోటీ పడగా.. రూ. 33 లక్షల రికార్డు ధరకు తిలక్ను మెదక్ ఫాల్కన్స్ సొంతం చేసుకుంది. స్టార్ పేసర్ సిరాజ్ను రూ.14 లక్షలకు వరంగల్ వారియర్స్ కైవసంచేసుకుంది.
అన్క్యాప్డ్ ప్లేయర్ల విభాగంలో లెఫ్మార్మ్ పేసర్ సీవీ మిలింద్కు భారీ డిమాండ్ ఏర్పడగా… అతడిని రూ 17 లక్షల అత్యధిక ధరకు ఖమ్మం ఏసెస్ జట్టు కొనుగోలు చేసింది. ఇతర ఐకాన్ ప్లేయర్లలోరవి కిరణ్ (పాలమూరు), టి. రవితేజ (మెదక్ ), తనయ్ త్యాగరాజన్ (రంగారెడ్డి రైజర్స్), రాహుల్ బుద్ధి (నల్గొండ నైట్స్), తన్మయ్ అగర్వాల్ (కరీంనగర్ డైమండ్స్), రోహిత్ రాయుడు (పాలమూరు) కూడా మంచి రేటు దక్కించుకున్నారు. ఏ -కేటగిరిలో అర్ఫాజ్ అహ్మద్, అభిరత్ రెడ్డి చెరో రూ.11 లక్షల ధర పలికారు. వేలం కోసం ప్రతీ ఫ్రాంచైజీకి కేటాయించిన రూ. 60 లక్షల పర్స్ కేటాయించారు. అన్ని ఫ్రాంచైజీలు మొత్తం రూ.4.74 కోట్లు ఖర్చు చేసి 160 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.