దుబాయ్: భారత జట్టు మాజీ సారధి, క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ టీమిండియా కొత్త కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి పదవీకాలం ముగియనుంది. దీంతో ఎలాగైనా ద్రవిడ్కు టీమిండియా కోచ్ బాధ్యతలు అప్పగించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ సహా పలువురు భావించారు.
కానీ ఈ పదవిపై ద్రవిడ్ పెద్దగా ఆసక్తి చూపలేదు. సున్నితంగా ఈ ఆఫర్ను తిరస్కరిస్తూ వచ్చారు. అయితే ఇటీవల ముగిసిన ఐపీఎల్ ఫైనల్ సమయంలో గంగూలీ, ద్రవిడ్, బీసీసీఐ సెక్రటరీ జైషా సమావేశం అయ్యారు. ఆ సమయంలో గంగూలీ, షా కలిసి ద్రవిడ్ను ఒప్పించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఇదే విషయాన్ని బీసీసీఐకి చెందిన అధికారులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం నేషనల్ క్రికెట్ అకాడమీలో ద్రవిడ్ సేవలందిస్తున్నాడు.
అక్కడ అతని టీంలో ఉన్న ఫీల్డింగ్ కోచ్ అభయ్ శర్మ, బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రే కూడా టీమిండియా పదవుల కోసం దరఖాస్తులు సమర్పించారు. ఈ క్రమంలోనే దరఖాస్తులకు చివరి రోజున ద్రవిడ్ కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసినట్లు బీసీసీఐ అధికారులు అంటున్నారు. టీమిండియా కోచ్గా ద్రవిడ్నే నియమించాలని గంగూలీ, జైషా ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారని, కానీ ద్రవిడ్ ఆసక్తి చూపలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
ఈ క్రమంలోనే ఐపీఎల్ ఫైనల్ సందర్భంగా జరిగిన భేటీలో వీరిద్దరూ కలిసి ద్రవిడ్ను ఒప్పించడంతో టీమిండియా కోచ్ పదవికి ద్రవిడ్ లాంఛనంగా దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. ఎన్సీఏలో ద్రవిడ్ స్థానంలో క్లాసికల్ బ్యాట్స్మెన్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమించాలని బీసీసీఐ ప్రయత్నిస్తోందట.