IPL-Tata Tiago | కోట్లాది మంది భారతీయులకు కనువిందు చేసే ఐపీఎల్-2023 సీజన్ ప్రారంభమైంది. డిఫెండింగ్ చాంపియన్స్ గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య ఓపెనింగ్ మ్యాచ్లో విజయంతో గుజరాత్ బోణీ చేసింది. దాదాపు రెండు నెలల పాటు సాగే సుదీర్ఘ క్రీడా సంరంభంలో టాటా మోటార్స్ వారి టియాగో ఈవీ పాలు పంచుకుంటున్నది. ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్రికెట్ లీగ్ టోర్నీ ఐపీఎల్ అధికారిక పార్ట్నర్ గా టాటా టియాగో ఈవీ చేరింది.
ఐపీఎల్ మ్యాచ్లు జరిగే 12 స్టేడియంల వద్ద టియాగో ఈవీ డిస్ప్లే చేస్తారు. మ్యాచ్లను వీక్షించడానికి వచ్చే ప్రేక్షకులను కనెక్ట్ చేసే పలు అంశాలపై చాలా ఆసక్తికర పోటీలు కూడా నిర్వహిస్తారు. ఇందుకోసం టాటా మోటార్స్ ఎంపిక చేసిన ఐపీఎల్ మ్యాచ్ల టికెట్లు విక్రయిస్తుంది. ఈవీ విత్ టియాగో డాట్ ఈవీ క్యాంపెయిన్ కోసం టోర్నమెంట్ పార్టనర్గా చేరింది. ప్రజలంతా ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లను ప్రోత్సహించడమే ఈ క్యాంపెయిన్ లక్ష్యం. ఎలక్ట్రిక్ కార్ల పట్ల పుక్కిటి పురాణాలను తిప్పికొట్టడమే టాటా మోటార్స్ క్యాంపెయిన్ ప్రధాన లక్ష్యం.
ఈ ఐపీఎల్ సీజన్లోని అన్ని మ్యాచ్ల్లో శరవేగంగా పరుగులు చేసిన క్రికెటర్కు టాటా మోటార్స్ రూ.లక్ష నగదు బహుమతి, ఈవీ ఎలక్ట్రిక్ స్టిక్కర్ అవార్డు ట్రోఫీ అందజేస్తారు. డిస్ప్లేపై ఉన్న టియాగో కారును బంతి తాకిన ప్రతిసారి కర్ణాటకలో కాఫీ ప్లాంటేషన్స్లో జీవ వైవిధ్యాన్ని పెంచడానికి టాటా మోటార్స్ రూ.5 లక్షల విరాళం అందజేస్తుంది.
టాటా మోటార్స్ ఆరేండ్లుగా ఐపీఎల్ స్పాన్సరర్గా ఉంది. బీసీసీఐతో వరుసగా ఆరో ఏడాది అనుబంధం పెంచుకున్న టాటా మోటార్స్ తొలిసారి 2018లో ఐపీఎల్ స్పాన్సరర్గా నిలిచింది. గతేడాది టోర్నీ టైటిల్ స్పాన్సరర్గా మారింది టాటా మోటార్స్. తొలిసారి టాటా నెక్సాన్ కారు డిస్ప్లే చేసింది. గతేడాది ఐపీఎల్లో మైక్రో ఎస్యూవీ పంచ్ కారును డిస్ప్లే చేస్తే, కొన్ని మ్యాచ్లకు కజిరంగా ఎడిషన్ డిస్ప్లేలో పెట్టింది.