T20 World Cup | ఇటీవల పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్ష పగ్గాలు చేపట్టిన రమీజ్ రజా.. టీ20 ప్రపంచకప్ ఆడే జట్టులో మార్పులు చేసి అందరి ప్రశంసలూ పొందాడు. పొట్టి ప్రపంచకప్ ముందు సడెన్గా తమ కోచ్ పదవులకు వకార్ యూనిస్, మిస్బా ఉల్ హక్ రాజీనామాలిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఇలాంటి సమయంలో అనుభవజ్ఞులైన సక్లయిన్ ముస్తాక్, మాథ్యూ హేడెన్, ఫిలాండర్తో ఈ స్థానాలు భర్తీ చేశాడు రమీజ్ రజా. వీరంతా కలిసి పాక్ జట్టును ఈ ప్రపంచకప్లో అజేయ శక్తిగా మార్చారు. గ్రూప్ దశలో ఆ జట్టు ఒక్క ఓటమి కూడా ఎదుర్కోలేదు. అంతేకాదు ఇప్పటి వరకూ ప్రపంచకప్లలో ఒక్కసారి కూడా భారత్పై విజయం సాధించని పాక్.. ఈసారి ఆ చరిత్రను కూడా తిరగరాసింది. పాక్ అభిమానుల దాహాన్ని తీర్చింది.
అదే ఊపులో వరుస విజయాలతో సెమీఫైనల్ చేరింది. ఆస్ట్రేలియాతో జరిగే ఈ మ్యాచ్లో పాకిస్థానే ఫేవరెట్ అనడం అతిశయోక్తేమీ కాదు. ఈ క్రమంలో పీసీబీ చీఫ్ రమీజ్ రజా.. తమ జట్టుకు వీడియో సందేశం పంపారు. తాను కూడా మూడు ప్రపంచకప్లు ఆడానని, ఒక ఆటగాడిగా విశ్వకప్లు ఆడే అనుభవం వేరుగా ఉంటుందని చెప్పాడు.
జట్టును బాబర్ ఆజమ్ అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడని కొనియాడాడు. ‘ఇప్పటి వరకూ అద్భుతంగా ఆడారు. ఒక క్రికెటర్గా చెప్తున్నా, ఈ జట్టును ఓడించడం అసంభవం. ప్రత్యర్థి ఎవరైనా సరే, ఇప్పటి వరకూ ఆడుతున్న తరహా ఆటనే ఆడండి’ అంటూ జట్టుకు వీడియో సందేశం పంపారు. పీసీబీ ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేశారు.