T20 World Cup | టీ20 ప్రపంచకప్ తొలి సెమీఫైనల్లో టైటిల్ ఫేవరెట్ ఇంగ్లండ్ను మట్టికరిపించి న్యూజిల్యాండ్ జట్టు ఫైనల్ చేరింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన కివీ ఓపెనర్ డారియల్ మిచెల్.. మ్యాచ్ అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ఈ మ్యాచ్ 18వ ఓవర్లో ఒక ఘటన జరిగింది.
అదిల్ రషీద్ ఆ ఓవర్ వేశాడు. ఆ సమయంలో స్ట్రైకింగ్లో ఉన్న నీషమ్.. సింగిల్ కోసం ప్రయత్నించాడు. అయితే ఆ పరుగు తీయడానికి మిచెల్ నిరాకరించాడు. ఇదే విషయాన్ని పాత్రికేయులు ప్రస్తావించగా.. తను అలా చేయడానికి గల కారణాలను మిచెల్ వెల్లడించాడు.
‘ఆ సమయంలో రషీద్కు నేను అడ్డు వెళ్లినట్లు అనిపించింది. అప్పుడు పరుగు తీసి ఒక కాంట్రవర్సీ సృష్టించడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆ పరుగు వదిలేసుకున్నా. మళ్లీ మొదటి నుంచి ప్రారంభించడమే మంచిదని భావించా. నా నిర్ణయం జట్టు ఫలితంపై ప్రభావం చూపకపోవడం అదృష్టం’ అని మిచెల్ వివరించాడు.
న్యూజిల్యాండ్ జట్టు క్రికెట్ స్ఫూర్తిని ఎక్కడా కోల్పోదని, క్రీడాస్ఫూర్తితోనే క్రికెట్ ఆడుతుందని అతను స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్లో 47 బంతుల్లో 72 పరుగులతో అజేయంగా నిలిచిన మిచెల్.. కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్లో అతనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు కూడా.