పొట్టి ఫార్మాట్లో ప్రపంచ నంబర్వన్ సూర్యకుమార్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయడంతో టీమ్ఇండియా మరో సిరీస్ ఖాతాలో వేసుకుంది. రాజ్కోట్లో ‘360 డిగ్రీస్ ప్లేయర్’అజేయ శతకంతో వీరంగమాడగా.. శుభ్మన్ గిల్, రాహుల్ త్రిపాఠి అతడికి అండగా నిలిచారు. కొండంత లక్ష్యాన్ని చూసి లంకేయులు ముందే డీలాపడగా.. మన బౌలర్లు సమష్టిగా సత్తాచాటి మిగిలిన పనిపూర్తి చేశారు. తొలి రెండు మ్యాచ్ల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యువ ఆటగాళ్లు.. ఆఖరి పోరులో కలిసికట్టుగా కదంతొక్కడంతో యంగ్ఇండియా సాధికారిక విజయంతో సిరీస్ చేజిక్కించుకుంది.
రాజ్కోట్: బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై సూర్యకుమార్ యాదవ్ (51 బంతుల్లో 112 నాటౌట్; 7 ఫోర్లు, 9 సిక్సర్లు) విశ్వరూపం కనబర్చడంతో టీమ్ఇండియా సిరీస్ పట్టేసింది. బంతి ఎక్కడపడ్డా దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న చందంగా విరుచుకుపడిన సూర్య.. లంకేయులకు తన ప్రతాపాన్ని చూపాడు. ఫోర్ల కన్నా ఎక్కువ సిక్సర్ల మీదే దృష్టిపెట్టిన ఈ ముంబై చిన్నోడు.. టీ20ల్లో మూడో సెంచరీ తన పేరిట రాసుకున్నాడు. ఫలితంగా శనివారం ఇక్కడ జరిగిన నిర్ణయాత్మక మూడో మ్యాచ్లో భారత్ 91 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసి 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. సూర్యకుమార్ అజేయ శతకంతో కదంతొక్కగా.. శుభ్మన్ గిల్ (46; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), రాహుల్ త్రిపాఠి (16 బంతుల్లో 35; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), అక్షర్ పటేల్ (9 బంతుల్లో 21 నాటౌట్; 4 ఫోర్లు) రాణించారు. ఇషాన్ కిషన్ (1), కెప్టెన్ హార్దిక్ పాండ్యా (4), దీపక్ హుడా (4) విఫలమయ్యారు. లంక బౌలర్లలో మధుషనక 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 16.4 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ దసున్ షనక (23) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్దీప్ 3 వికెట్లు పడగొట్టాడు. సూర్యకుమార్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’, అక్షర్కు ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’అవార్డులు దక్కాయి.
క్రికెట్ పుస్తకంతో పనిలేకుండా.. ఏ బంతికి ఎలాంటి షాట్ ఆడాలో లెక్కలేసుకోకుండా.. మైదానం నలువైపులా పరుగుల వరద పారిస్తూ.. ‘360 డిగ్రీస్ ప్లేయర్’గా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకుమార్ రాజ్కోట్లో మరోమారు తన బ్యాట్ పవర్ చూపాడు. బౌలర్తో సంబంధం లేకుండా తన అమ్ములపొదిలోని అన్ని అస్ర్తాలను సమర్ధవంతంగా వినియోగించుకున్న సూర్య.. తన చిన్న కెరీర్లోనే టీ20ల్లో మూడో సెంచరీ నమోదు చేసుకున్నాడు. చినుకులా మొదలై.. వరదలా మారి.. ఉప్పెనై లంకను ముంచెత్తిన సూర్యకుమార్.. అర్ధశతకం చేయడానికి 26 బంతులు తీసుకోగా.. ఆ తర్వాత మరో 19 బంతుల్లోనే సెంచరీ మార్క్ చేరుకున్నాడు. వీడియో గేమ్ ఇన్నింగ్స్తో మైదానాన్ని హోరెత్తించిన సూర్య.. తన ట్రేడ్మార్క్ షాట్లతో అభిమానులను అలరించాడు. ఇషాన్ విఫలమైనా.. గిల్, త్రిపాఠి రాణించడంతో పవర్ప్లే ముగిసేసరికి భారత్ 53/2తో నిలువగా.. ఇక అక్కడి నుంచి దంచుడు ప్రారంభించిన సూర్యకుమార్ డీప్ కవర్లో సింగిల్ ద్వారా ఈ ఫార్మాట్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
భారత్: 20 ఓవర్లలో 228/5 (సూర్యకుమార్ 112 నాటౌట్, గిల్ 46; మధుషనక 2/55), శ్రీలంక: 16.4 ఓవర్లలో 137 ఆలౌట్ (మెండిస్ 23, షనక 23; అర్ష్దీప్ 3/20, పాండ్యా 2/30).