IND vs AUS: వన్డే వరల్డ్ కప్ కోల్పోయిన బాధలో ఉన్న భారత అభిమానులకు వారం రోజులు తిరగకముందే మరో క్రికెట్ సమరం వారిని ఉర్రూతలూగించేందుకు సిద్ధమవుతోంది. గురువారం నుంచి భారత్.. ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఆడనుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం వేదికగా సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో యువ భారత్.. కంగారూలతో తాడో పేడో తేల్చుకోనుంది. ఆడేది ఆస్ట్రేలియాతో అయినా ప్రిపరేషన్ మాత్రం టీ20 వరల్డ్ కప్ కోసమే అన్నది బహిరంగ రహస్యమే.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్లు ఈ సిరీస్కు దూరమైన నేపథ్యంలో ఈ సిరీస్ నుంచే భారత్ యువమంత్రాన్ని జపిస్తున్నది. రుతురాజ్ గైక్వాడ్కు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పిన భారత్.. యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్ వంటి యువ ఆటగాళ్లను వచ్చే ఏడాది జులైలో జరగాల్సి ఉన్న టీ20 వరల్డ్కప్ నాటికి పూర్తిస్థాయిలో సిద్ధం చేయాలని భావిస్తోంది. బలమైన ఆసీస్ వంటి ప్రత్యర్థితో ఆడుతుండటం వీళ్లకు కలిసొచ్చేదే. పైన పేర్కొన్న కుర్రాళ్లంతా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో గత రెండు మూడు సీజన్లుగా పరుగుల వరద పారిస్తున్నవారే. తమ మెరుపులతో భారత జట్టులోకి స్థానం దక్కించుకున్నవారే. అయితే వీరిలో అంతర్జాతీయ స్థాయిలో సవాళ్లను ధీటుగా ఎదుర్కునేవాళ్లు ఎవరు..? ఎవరు ఒత్తిడిని తట్టుకోని ఆడగలరు..? జట్టు కూర్పు ఎలా ఉండాలి..? అన్న విషయాలపై ఆసీస్ సిరీస్ ద్వారా ఓ క్లారిటీ రానున్నది.
హార్ధిక్ పాండ్యా గైర్హాజరీలో సూర్యకుమార్ యాదవ్కు కూడా ఈ సిరీస్కు అత్యంత కీలకం. వన్డేలకు పనికిరాడని సూర్యపై విమర్శలు వస్తున్న నేపథ్యంలో పొట్టి ఫార్మాట్లో అయినా తన ప్లేస్ను కాపాడుకోవడంతో పాటు ఒకవేళ హార్థిక్ లేకున్నా జట్టును నడిపించేదిశగా అతడిని సిద్ధం చేయడానికి సెలక్టర్లకు ఇది మంచి అవకాశం. అశ్విన్ ప్లేస్ను వాషింగ్టన్ సుందర్తో భర్తీ చేయించాలని భావిస్తున్న సెలక్టర్లు.. బిష్ణోయ్కు కూడా వరుసగా అవకాశాలు ఇచ్చేందుకూ సిద్ధమయ్యారు. పేసర్లలో ఇదివరకే అర్ష్దీప్ సింగ్ జట్టులో కుదురుకునే ప్రయత్నం చేస్తుండగా ముఖేశ్ కుమార్, ప్రసిధ్ కృష్ణలు ఎలా రాణిస్తారనేది ఆసక్తికరం.
🚨 NEWS 🚨#TeamIndia’s squad for @IDFCFIRSTBank T20I series against Australia announced.
Details 🔽 #INDvAUShttps://t.co/2gHMGJvBby
— BCCI (@BCCI) November 20, 2023
అవతలి వైపు ఆస్ట్రేలియా కూడా బలమైన జట్టుతోనే బరిలోకి దిగుతోంది. మాథ్యూ వేడ్ సారథ్యంలో ఆ జట్టులో ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్వెల, టిమ్ డేవిడ్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లిస్, ఆరోన్ హార్డీ, ఆడమ్ జంపా వంటి ఆటగాళ్లతో ఆడబోతోంది. వీళ్లంతా అంతర్జాతీయ క్రికెట్లో ఆరితేరినవారే. మరి వీళ్లను యువ భారత్ ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం.